Mudragada Padmanabham: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కోపం వచ్చింది. దీంతో ఆయనపై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ లేఖ రాశారు. ఇంతకూ ముద్రగడ పద్మనాభంకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కోపం రావడానికి కారణం ఏమిటంటే..? వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమాన్ని రాధాకృష్ణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇటీవల పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడును ఇంటర్వ్యూ చేస్తున్నసందర్భంలో రాధాకృష్ణ ..ముద్రగడ పద్మనాభం పేరును ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం లాంటి వారు కాపుల గురించి మాట్లాడతారు కదా.. ! ఒకరినైనా ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా..? అని రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సున్నా అని సమాధానం ఇచ్చారు.
Mudragada Padmanabham: పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే కాపు ఉద్యమం
ఆ ఇంటర్వ్యూలో తన పేరు ప్రస్తావిస్తూ అవమానించేలా ప్రశ్న, సమాధానం రాబట్టడంపై ముద్రగడకు కోపం వచ్చినట్లు ఉంది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వేమూరి రాధాకృష్ణకు లేఖ రాశారు. ఈ లేఖలో రాధాకృష్ణకు పలు చురకలు అంటించారు. తాను పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే కాపు ఉద్యమం చేశానని పేర్కొన్నారు ముద్రగడ. లక్షాధికారిని కోటేశ్వరున్ని, కోటీశ్వరున్ని అపర కుబేరుడిగా చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. రాధాకృష్ణ ఆలోచనలు అమలు చేయని అసమర్ధుడిని, చేతకాని వాడిని అని అంగీకరిస్తున్నానని అన్నారు. రాధాకృష్ణ మాదిరిగా ఎదుటి వాళ్లను ఏకవచనంతో మాట్లాడే పత్రిక యజమానిని ఇంత వరకు తాను చూడలేదని అన్నారు ముద్రగడ. ఆంధ్రజ్యోతి యజమాని కేఎల్ఎన్ ప్రసాద్ ను కుర్చీలోంచి కాళ్లుపట్టుకుని లాగి ఆ కుర్చీలో కూర్చున్న ఘనత రాధాకృష్ణది అంటూ విమర్శలు గుప్పించారు ముద్రగడ పద్మనాభం.