Mudragada Padmanabham: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై దాదాపు ఇరువురు గంట పాటు చర్చించినట్లు తెలుస్తొంది. అయితే ఈ బేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ముద్రగడ పేర్కొన్నారు. సుబ్బారాయుడు సోదరుడు జానకిరామ్ ను పరామర్శించేందుకు నర్సాపురం వచ్చినట్ల ముద్రగడ తెలిపారు. కాకపోతే కొత్తపల్లి సుబ్బారాయుడుని వైసీపీ ఇటీవలే సస్పెండ్ చేసింది. ఆయన సస్పెండ్ కు గురైన కొద్ది రోజుల వ్యవధిలోనే ముద్రగడ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు కావడంతో రకరకాలుగా ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mudragada Padmanabham: రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన తరువాత…
కొత్తపల్లి సుబ్బారాయుడు అయిదు సార్లు ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా, ఒక పర్యాయం ఎంపిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు కార్పోరేషన్ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వహించారు. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజును విమర్శిస్తూ మాట్లాడటంతో ఆయన పై పార్టీ సీరియస్ అయ్యింది. ఆందోళన నేపథ్యంలో ఆయన పై కేసు నమోదు చేయడంతో పాటు ఆయనకు ఉన్న గన్ మెన్ సౌకర్యాన్ని ప్రభుత్వం తొలగించింది. నియోజకవర్గంలో తనకు వ్యక్తిగతంగా బలం ఉందనీ, రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తాను పోటీ చేస్తానని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించిన తరువాత పార్టీ ఆయనపై వేటు వేసింది.
భవిష్యత్తు రాజకీయ ప్రణాళికపై
పార్టీ నుండి సస్పెండ్ కు గురైన తరువాత పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై క్రమశిక్షణా సంఘానికి ఎవరు ఫిర్యాదు చేశారు, తనను సంప్రదించకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు కొత్తపల్లి సుబ్బారాయుడు. నిత్యం ప్రభుత్వంపై విమర్శించే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని కూడా ప్రశ్నించారు సుబ్బారాయుడు. పార్టీ నుండి సస్పెండ్ అయిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికపై ఇంత వరకూ సుబ్బారాయుడు నోరు మెదపలేదు. ముద్రగడ పద్మనాభంతో భేటీ అనంతరం కూడా ఎటువంటి విషయాలు వెల్లడించలేదు. అయితే ఇద్దరి నేతల భేటీలో రాజకీయ పరమైన అంశాలు చర్చ జరిగే ఉంటుందని భావిస్తున్నారు.