Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. త్వరలోనే రాజకీయాల్లో తన పాత్ర పై నిర్ణయాన్ని ప్రకటిస్తానని ముద్రగడ పేర్కొనడం ఇప్పుడు ఏపి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. గత కొన్నేళ్లుగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు సిద్దమైయ్యారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో పని చేసి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ముద్రగడ .. 2014 నుండి రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం కాపు, బీసీ సామాజిక వర్గ నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించడంతో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఆయన రాజకీయం యాక్టివ్ అవ్వడానికి నిర్ణయం తీసుకోవడంతో ఏ పార్టీలో చేరతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముద్రగడ వైసీపీలో చేరతారా.. లేక కొత్త పార్టీ పెట్టనున్నారా అన్న సందేహం కూడా అందరిలోనూ నెలకొంది. తుని రైలు దగ్దం కేసును కోర్టు కొట్టివేయడంతో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్దమైయ్యారు. అయితే ముద్రగడ టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరేందుకు మాత్రం సిద్దంగా లేరు. ఆయన రాసిన బహిరంగ లేఖలోనే తుని రైలు దగ్దం కేసులో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించడానికి హెలికాఫ్టర్ ను కూడా సిద్దం చేసారని పేర్కొనడంతో ఆయన ఆ రెండు పార్టీలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. టీడీపీతో జనసేన కలవకుండా బీజేపీతోనే పొత్తు కొనసాగిస్తే జనసేనలో చేరికపై ముద్రగడ ఆలోచించే అవకాశం ఉండేదనీ, కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకోవడం వల్ల ఆ పార్టీ వైపు చూసే అవకాశం లేదని అంటున్నారు.
టీడీపీ, చంద్రబాబుకు బద్ద వ్యతిరేక భావనతో ఉన్న ముద్రగడ .. వైసీపీ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారనీ, దీంతో ఆ పార్టీ లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గంలో చీలిక తీసుకురావాలంటే అది ముద్రగడతో సాధ్యమవుతుందని వైసీపీ భావిస్తొందనీ, అందుకే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందుకు ఆయనకు భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాకినాడ ఎంపీ సీటు లేదా రాజ్యసభ స్థానం ముద్రగడకు, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇచ్చే ప్రతిపాదనను ఆయన వద్దకు తీసుకువెళ్లారని అంటున్నారు. అయితే ముద్రగడ మాత్రం ఇంత వరకూ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతం కిర్లంపూడిలోనే ఉన్న ముద్రగడ పద్మనాభం తన సన్నిహితులతో భవిష్యత్తు రాజకీయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తొంది.
Punjab: స్వర్ణదేవాలయం సమీపంలో భారీ పేలుడు .. ఐదుగురు అరెస్టు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?