CM YS Jagan: దివంగత ఏపిపరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడానికి ముందు పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పలు కీలక పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు నిర్వహించడంతో పాటు పలు సంస్థలను ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. అప్పుడు గౌతమ్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్న ముల్క్ హోల్డింగ్స్ ఏపిలో తమ హబ్ ఏర్పాటు చేసేందుకు సంసిగ్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ నవాబ్ షాజీ ఉల్ ముల్క్ తన ప్రతినిధి బృందంతో మంగళవారం తాడేపల్లికి వచ్చి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సమావేశమైయ్యారు.
CM YS Jagan: కడప జిల్లాలో కొపర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
గౌతమ్ రెడ్డి సమక్షంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం కడప జిల్లాలో కొపర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ తెలిపారు. తమ బిజినెస్ ప్రణాళికపై సీఎంతో చర్చించారు. అల్యూమినియం కాయల్స్ తయారీ, కాయల్ కోటింగ్ కు ఉపయోగించే హై పర్ఫామెన్స్ పెయింట్స్ తయారీ, అల్యూమినియం కాయన్ కోటింగ్ ప్రొడక్షన్ లైన్స్, ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మినరల్ కోరోస్ ప్రొడక్షన్ లైన్స్, అల్యూమినియం కాంపోజిట్ ఫ్యానెల్స్, మెటల్ కాంపోజిట్ మెటీరియల్స్ ప్రొడక్షన్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది.
ఇందు కోసం ముల్క్ హోల్డింగ్స్ సంస్థ రూ.1,500 కోట్లను వెచ్చించనుంది. ఈ హబ్ తో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సమావేశంలో మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాలలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రౌడ్జీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జువ్వాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.