Municipal elections : రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు మార్చి 10వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నికలను అధికార వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనబడుతోంది. టీడీపీ తరపున నామినేషన్ లు దాఖలు చేసిన అభ్యర్థులకు వైసీపీ గాలం వేసి లాగేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో నలుగురు టీడీపీ అభ్యర్థులు వైసీపీ గూటికి చేరిపోయారు. ప్రధానంగా విశాఖ, విజయవాడ, గుంటూరు ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. అధికార, విపక్షాలు వీటిపై ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్న తరువాత జరుగుతున్న తొలి సింబర్ ఓటింగ్ కావడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ లను హస్తగతం చేసుకోవడం ద్వారా అమరావతి సెంటిమెంట్ లేదని నిరూపించాలన్న ప్రయత్నంలో అధికార వైసీపీ ఉంది. అదే మాదిరిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినందున అక్కడ గెలవకపోతే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ ప్రాంతం వారు స్వాగతించడం లేదనే అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది. ఈ కారణంతో వైసీపీ.. విశాఖలో సర్వశక్తులను ఒడ్డుతోంది. దానికి ప్రధాన కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినా విశాఖ పట్టణంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవశం చేసుకున్నది. గెలిచిన నాలుగు టీడీపీ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ వైసీపీ గూటికి చేరిపోగా, మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తూ ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ పట్టణంలో పట్టు సాదించేందుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఓ పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలకు అన్ని రాజకీయ పక్షాలు సంఘీభావం ప్రకటించాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగర పాలక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను కాపాడుకోవడం టీడీపీకి కష్టతరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుపై ప్రత్యేక దృష్టి పెట్టి నేతలకు బాధ్యతలు అప్పగించారన్నారు. గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ లు ఉపసంహరించుకుంటే విజయసాయి రెడ్డి కోటి రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?