Municipal Elections : రాష్ట్ర స్థాయిలో టీడీపీ – జనసేన దోస్తాన్ కటీఫ్ అయినా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆయా పార్టీల నేతలు ఓ అవగాహనతో ముందుకు సాగుతున్నారు. ఇది బీజెపీకి రుచించడం లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజెపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి చావు దెబ్బతిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జనసేన, బీజెపీ రాష్ట్ర స్థాయిలో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో బీజెపీకి పెద్దగా బలం లేకపోవడంతో పలు గ్రామాల్లోని పంచాయతీ ఎన్నికల్లో టీడీపీతో జనసేన లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫందాతో ముందుకు సాగుతోంది. నరసాపురం, జంగారెడ్డిగూడెం, మున్సిపాలిటీ ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. టీడీపీ, బీజెపీ అపవిత్ర పొత్తు అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్నది. బీజెపీని కాదని జనసేన టీడీపీతో జత కట్టడాన్ని ఉమ్మడి ప్రచారం నిర్వహించడంపైనా వైసీపీ ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నది. ఏలూరులో టీడీపీ అభ్యర్థులు లేని చోట్ల జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తానని కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నరసాపురం మునిసిపాలిటీల మొత్తం 31 వార్డులు ఉండగా వాటిలో మూడు వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 19 వార్డుల్లోనే టీడీపీ పోటీ చేస్తుండగా, జనసేన ఏడు వార్డుల్లో పోటీ చేస్తున్నది. టీడీపీ అభ్యర్థులు ఉన్న చోట జనసేన, జనసేన బలంగా వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలపలేరు. ఇక్కడ వైసీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన నాయకులు కృషి చేస్తున్నారు. జనసేన అభ్యర్థుల విజయం కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవరావు ప్రచారం నిర్వహిస్తుండగా, టీడీపీ అభ్యర్థుల విజయం కోసం జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మిడి నాయకర్ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రెండు పార్టీల అభ్యర్థులు కరపత్రాలు, పోస్టర్ లలో టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థులుగా ముద్రించి మరీ బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ మాత్రం నాలుగు వార్డుల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి ఒంటరిగా పోరాటం చేస్తున్నది.
అదే విధంగా జంగారెడ్డి గూడెం మున్సిపాలిటీలోనూ పలు వార్డుల్లో జనసేన, టీడీపీ పొత్తు రాజకీయం కొనసాగుతోంది. అదే మాదిరిగా ఏలూరు కార్పోరేషన్ లోనూ పలు డివిజన్ లలో టీడీపీ అభ్యర్థులను ఉపసంహరించుకున్నది. ఆ డివిజన్ లలో జనసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. ఈ వ్యవహారాలపై రాష్ట్ర బీజెపీ, జనసేన నాయకత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి.