Municipal Elections : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ, వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేసుకున్నారు. గుంటూరు 42వ డివిజన్ లో పోలింగ్ బూత్ వద్దకు వైసీపీ నేత, మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరో కారు అద్దాలను పగులగొట్టారు. దొంగ ఓట్లపై ఇరుపార్టీలకు చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
విద్యానగర్ లోని లిటిల్ ప్లవర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలే దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ అభ్యర్థి కొమ్మినేని కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసనగా టీడీపీ ఎంపి గల్లా జయదేవ్, పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు శ్రావణ్ ఆందోళన చేశారు. కాగా దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని, మోదుగుల కారు ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రూరల్ ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్ల ద్వంసానికి సంబంధించి వీడియో సాక్షాలు ఉన్నాయనీ, వారిపై కేసులు నమోదు చేసి దోషులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దొంగ ఓట్లపై పీఒ పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన తెలిపారు.