Municipal Elections : పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్పీప్ చేస్తున్నది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో అత్యధిక స్థానాలు వైసీపీ కైవశం చేసుకుంటోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఆరు కార్పోరేషన్ లు చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, గుంటూరు, ఒంగోలు కార్పోరేషన్ లు వైసీపీ గెలుచుకోగా విజయవాడ, విశాఖ నగర పాలక సంస్థలోనూ వైసీపీ లీడ్ లో ఉంది. విజయవాడ పట్టణంలో జనసేన అభ్యర్థులకు భారీగా ఓట్లు రావడంతో ఆ ప్రభావం టీడీపీ పై పడిందని అంటున్నారు. విజయవాడలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి కేశినేని స్వేత విజయం సాధించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసి ప్రభాకరరెడ్డి హవా కొనసాగుతోంది. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లా మైదుకూరులో పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ, టీడీపీకి 47 – 47 ఓట్లు సమానంగా వచ్చాయి. హోరా హోరీగా జరిగిన ఇక్కడి జరిగిన ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలు కైవశం చేసుకున్నది. అమలాపురంలో ఆరు వార్డులను జనసేన కైవసం చేసుకున్నది.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గానూ 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలను వైసీపీ కైవశం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గెల్లప్రోలు నగర పంచాయతీని వైసీపీ కైవశం చేసుకున్నది. 20 వార్డుల్లో 12 వార్డులను వైసీపీ గెలుచుకున్నది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ వైసీపీ కైవశం చేసుకున్నది. 20 వార్డుల్లో ఇప్పటి వరకూ 11 వార్డులను వైసీపీ కైవశం చేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి లో 25 వార్డులకు 25 వార్డులను వైసీపీ గెలుచుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 29 వార్డులకు 25 వార్డులను వైసీపీ గెలుచుకుంది. ఇప్పటి వరకూ దాదాపు 50 మున్సిపాలిటీలను వైసీపీ కైవశం చేసుకున్నది.
కృష్ణాజిల్లా నందిగామ మున్సిపాలిటీని వైసీపీ కైవశం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గానూ 13 వార్డులను వైసీపీ కైవశంచేసుకోగా ఆరు వార్డుల్లో టీడీపీ, ఒక వార్డు జనసేన గెలుచుకుంది. యలమంచిలి మున్సిపాలిటీ వైసీపీ కైవశం చేసుకుంది. మొత్తం 25 వార్డులకు గాను మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ జరిగిన 22 వార్డుల్లో 20 వార్డులను వైసీపీ కైవశం చేసుకుంది. ఒక వార్డులో టీడీపీ, ఒక వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తాడిపత్రిలో టీడీపీ 18, వైసీపీ 16 వార్డులు కైవశం చేసుకోగా ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి, ఒకటి సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఉత్కంఠ భరితంగా మారనున్నది. వైసీీపీ ఎమ్మెల్యే, పెద్దారెడ్డి, ఎంపి తలారి రంగయ్య ఎక్స్ అఫిషియో ఓట్లతో వైసీపీ, టీడీపీ బలం 18-18 కావడంతో స్వతంత్ర, సిపిఐ అభ్యర్థులు కీలకంగా మారారు. సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవశం చేసుకుంది. మొత్తం 38 వార్డులకు గానూ 29 వార్డుల్లో వైసీపీ, ఆరు వార్డుల్లో టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి ఒకటి, బీజేపీ ఒకటి, ఎంఐఎం ఒక వార్డులో గెలుపొందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని వైసీపీ విజయం సాదించింది. మొత్తం 31 వార్డులకు గానూ వైసీపీ 18, టీడీపీ 11 చోట్ల విజయం సాధించింది,. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాదించారు.
Municipal Elections : వైసీపీ కార్యాలయంలో సంబరాలు
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుండటంతో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి డప్పులు మోగిస్తూ వేడుకలు జరుపుకొంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.