Mysura reddy: తెలంగాణ, ఏపి మధ్య జల జగడం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నీటి ప్రాజెక్టుల అంసంపై ఏపిపై తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం ఏపి ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం చూశాం. ఈ నేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా, ఏపి ప్రభుత్వం స్వాగతించింది. ఈ అంశాలపై మాజీ మంత్రి, రాయలసీమ నేత డాక్టర్ మైసూరారెడ్డి ఘాటుగా స్పందించారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్రభుత్వం ఉండుంటే రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదుకదా అని మైసూరా అన్నారు. రాయలసీమ ఏపిలో అంతర్భాగమో కాదో చెప్పాలని ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టులపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలి పెట్టు అని అన్నారు. గెజిట్ ను స్వాగతించే ముందు సీఎం జగన్ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదన్నారు. రాయలసీమను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మైసూరా.
ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు వల్ల ఇరు రాష్ట్రాలకు నష్టం కలుగుతోందని అని పేర్కొన్న మైసూరా పోలవరం ప్రాజెక్టు పై అయిదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు సీఎంలు మాట్లాడుకోలేరా అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించాలని ప్రతిపక్ష నేతగా జగన్ డిమాండ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలంలో మూడు టీఎంసీలు మాత్రమే వినియోగించాలనీ, ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏపి ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని మైసూరా డిమాండ్ చేశారు. కేసిఆర్, జగన్ లు రాజకీయ లబ్దికోసం కీచులాడుకుని జుట్టును కేంద్రం చేతిలో పెట్టారని మైసూరా వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోక పోవడం వల్లన బోర్డులు మితిమీరి జోక్యం చేసుకున్నాయన్నారు. శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తుంటే ఏపి పాలకులు నిద్రపోతున్నారని మైసూరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?