Mega Fans: అభిమాన సంఘ కార్యకర్తలు రాజకీయంగా ఎదగాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన మెగా అభిమాన సంఘాల నేతలతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి వరకూ పార్టీని తీసుకువెళ్లాలని సూచించారు. చిరు సూచనలతో మెగా అభిమానులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మనోహర్ ప్రశంసించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mega Fans: సేవా కార్యక్రమాలతో గుర్తింపు, గౌరవం
“సమాజాన్ని ఏదో విధంగా ఆదుకోవాలి. పది మందికి సహాయ పడాలి. మంచి కార్యక్రమాలు చేయాలి. వీటన్నింటితో పాటు నిజాయితీగా ఉండాలని అనేది మెగా ఫ్యామిలీకి బలమైన కోరిక. సాధారణంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కు వేరే వాళ్లకు తేడా ఏమిటి అంటే ఫ్లెక్సీల విషయంలో ఏవో గొడవలు అవుతాయి. లేదా సినిమా సందర్భాల్లో ఏవో గొడవలు అవుతాయి. కానీ రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు మాత్రం ప్రతి రోజు గొడవలు ఉంటాయి. చిరంజీవి బ్లడ్ క్యాంప్ కానీ, తరువాత కరోనా సమయంలో ఆక్సిజన్ సిలెండర్లు అందజేయడం ద్వారా మంచి గుర్తింపు, గౌరవం వచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులు వెళ్లలేని ప్రాంతాలకు మెగా అభిమానులు చేరుకుని సాయమందించారు. మనం ఫిజికల్ గానే కాదు మెంటల్ గా ఇంటిగ్రేషన్ అవ్వాలి. మూడు నెలలు సమయం పెట్టుకుందాం. ఈ మూడు నెలల్లో మరల మరల కలుద్దాం, కమిటీలను ఏర్పాటు చేసుకుందాం. మనం సమాజానికి ఉపయోగపడే కార్యకర్తలుగా, వ్యక్తులుగా జన సైనికులుగా నిలబడదాం, దానికి మీరు సిద్దం అవ్వండి” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఎక్కడా తగ్గొద్దు
“ఇంత మంచి నాయకత్వం మనకు ఎప్పుుడు రాదు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. దయచేసి ఎక్కడా కూడా తగ్గొద్దు. మనం యూనిటీగా ఉంటేనే ప్రతిపక్షంగా బలంగా ఎదిగితేనే వాళ్లను ఎదుర్కొగలుగుతాం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకుని వెళ్లిపోయారు. ఇటువంటి నాయకత్వం, ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. రాజకీయంగా మనం ఎదగాలి. దాని కోసం మీరు అంతా కష్టపడాలి పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని మనోహర్ దిశానిర్దేశం చేశారు. మెగా అభిమాన సంఘం నేత స్వామినాయుడుతో సహా పలువురు ఈ సమావేశంలో మాట్లాడారు.