Nandamuri Bala krishna : గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో రాష్ట్రంలో టీడీపీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది అన్నది అందరికీ తెలిసిందే. గెలిచిన 23మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఇప్పటికే అధికార ఫ్యాన్ గాలి కోసం వెళ్లి పోగా మరి కొందరు డైలమాలో ఉన్నారు. క్యాడర్ కూడా గతంలో ఉన్న ఉత్సాహంగా పార్టీ కోసం పని చేయలేని పరిస్థితులు లేవు. పార్టీ మళ్లీ బలోపేతం కావాలంటే ఎన్టీఆర్ వారసులు రావాలని ఆ పార్టీ నుండే వినిపిస్తోంది. ప్రస్తుతం స్థానిక పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో బలంగా ఉన్న గ్రామాల్లో పోటీకి సై అంటున్నారు. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీతో ఇబ్బందులు దేనికని ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తున్నారు. కొన్ని చోట్ల బలవంతపు కారణాలతో పోటీ నుండి విరమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ క్యాడర్ కు, నందమూరి అభిమానులను ఫుల్ జోష్ నింపే వార్త అందింది.
అభిమానులకు బూస్ట్ ఇచ్చిన బాలయ్య మాటలు
సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫుల్ టైమ్ పొలిటీషిన్ గా రానున్నారుట. ఇటీవల నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుడితో జరిగిన సంభాషణలో రాజకీయాల్లో తన సత్తా ఏమిటో చూపిస్తానని చెప్పారుట. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమా తర్వాత రాజకీయాల్లో నా సత్తా ఏమిటో ఏంతో చూపిస్తానని బాలయ్య సంచలన ప్రకటన చేశారు. అభిమానుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమనీ, జనం కోసం త్వరలో రోడ్డు మీదకు వస్తానని పేర్కొన్నారుట. నెల్లూరు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్వతహాగా బాలయ్య అభిమాని, అభిమానులకు బాలయ్యకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా గ్రామాల్లో తిరుగుతున్న కోటంరెడ్డి ఇటీవల బాలయ్యకు ఫోన్ చేసి అభిమానులతో మాట్లాడించారుట.
Nandamuri Bala krishna : వైసీపీ ప్రభుత్వంపై బాలయ్య విసుర్లు
ఈ సందర్భంలో బాలకృష్ణ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ తాను నటిస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత రోడ్డు మీదకు వస్తాననీ, ప్రజలందరినీ కలుస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరూ భయపడవద్దని టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు ఆయన సూచించారు. తాను కూడా మానసికంగా సిద్ధం అవుతున్నాననీ, బోయపాటి శ్రీను సినిమా తరువాత నా అసలు అవతారం చూపిస్తా, నేనేంటో, నా సంగతేమిటో చూపిస్తానని ప్రకటించారు. ఈ మాటలు బాలయ్య అభిమానులు, పార్టీ క్యాడర్ లో మంచి జోష్ ను నింపాయట. రోడ్డు మీదకు వస్తాను, జనాలందరినీ కలుస్తాను అని చెప్పడంతో వైఎస్, చంద్రబాబు, జగన్ మాదిరిగా బాలకృష్ణ కూడా పాదయాత్ర చేస్తారని భావిస్తున్నారు. ఈ వార్త రాష్ట్రంలో తీవ్ర సంచలనం అవుతోంది.