Nandamuri bala krishna : ఏపి AP లో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో పంచాయతీలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏకగ్రీవం చేసుకునేందుకు నాయకులు అన్ని రకాల ప్రయత్నాలలో ఉన్నారు. అయితే బలవంతపు ఏకగ్రీవాలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పాటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల సంఘం కొంత కఠినంగా వ్యవహరిస్తుండటంతో నామినేషన్ లు ఊహించిన స్థాయి కంటే ఎక్కువగానే వచ్చాయి. పలు గ్రామాల్లో పెద్దలు సమావేశాలు నిర్వహించుకుని రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో ఓ అధికార పార్టీ నేత దౌర్జన్యకర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అనంతపురం జిల్లా హిందూపుర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుండి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుండి బాలయ్య గెలిచారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ గెలుచుకున్నది. ఈ ఊపుతో హిందూపూర్ అసెంబ్లీ స్థానంలోనూ బలాన్ని పెంచుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి నవీన్ నిశ్చల్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఒక భూ వివాదంతో ఆదినారాయణ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేయడంతో బాధితుడు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.
ఒక వైపు జగన్మోహనరెడ్డి దళితుల అభ్యున్నతి, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతుంటే ఆ పార్టీ నేత ఈ విధంగా వ్యవహరించడం ఏమిటంటూ విమర్శలు వస్తున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నవీన్ నిశ్చల్ తో పాటు మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్టాసిటీ యాక్ట్ తో పుట 384 రెడ్ విత్ 34 ఐసీపీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిపై కేసు నమోదు కావడం సంచలనం అయ్యింది. ఈ ఘటనపై హిందూపూర్ వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ ఇంకా స్పందించలేదు.