Nandamuri Balakrishna: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమాన నటుడు కావచ్చు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహనరెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికరంగా మారింది. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని బాలకృష్ణ కోరుతున్నారు. దీనికి జగన్మోహనరెడ్డి అంగీకరిస్తారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. విషయంలోకి వెళితే.. ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ రాష్ట్రంలోని 13 జిల్లాలలను 26 జిల్లాలుగా చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల విభజనలో శాస్త్రీయత లోపించిందని, ప్రజాభీష్టానికి భిన్నంగా రాజకీయ ప్రయోజనాలతో జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. అధికార వైసీపీ నేతలు మాత్రం కొత్త జిల్లా కేంద్రాల్లో ఆనందోత్సాహాలతో ర్యాలీలు నిర్వహించారు. జగన్మోహనరెడ్డి ఫోటోకు పాలాభిషేకాలు చేశారు.
Nandamuri Balakrishna: సత్యసాయి బాబా జిల్లా కేంద్రంగా పుట్టపత్రి
అయితే అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సత్యసాయి బాబా జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం.. జిల్లా కేంద్రంగా పుట్టపత్రిని ప్రతిపాదించింది. దీనిపై హిందూపురంలోని స్థానికులు, వివిధ రాజకీయ పక్షాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ కేంద్రంగా ఉన్న హిందూపురాన్నే జిల్లా కేంద్రంగా చేసి సత్యసాయి బాబా జిల్లా పేరునే కొనసాగించాలని కోరుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తం చేశారు.
హిందూపురంలో బాలకృష్ణ ధర్నా
హిందూపురాన్ని సత్యసాయి బాబా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బాలకృష్ణ శుక్రవారం (నేడు) హిందూపురంలో భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నారు. ముందుగా అఖిలపక్ష సమావేశంలో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం రాజకీయాలకు అతీతంగా హిందూపురం ప్రజలు, అఖిలపక్ష నేతలతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేయనున్నారు. హిందూపురం అసెంబ్లీ నుండి నందమూరి బాలకృష్ణ 2014,2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ కారణంతోనే హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయకుండా సత్యసాయి బాబా జిల్లాకు పుట్టపత్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించారనే మాట వినబడుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ సహా వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.