Nandamuri : రాష్ట్రంలో స్థానిక పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది, ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండు విడతల పోలింగ్ పూర్తి అయ్యింది. మెజార్టీ స్థానాలు వైసీపీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. ఏకగ్రీవాలు కూడా బాగానే అయ్యాయి. అయితే రాజకీయాలపై అంటీ ముట్టనట్లుగా ఉంటే ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని తన నియోజకవర్గంలో పర్యటించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హిందూపురం నియోజకవర్గం నుండి రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లోనూ పెద్దగా యాక్టివ్ గా ఉన్నది లేదు. అడపా దడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ సినీ రంగానికే ఎక్కువగా టైమ్ కేటాయిస్తూ వస్తున్నారు. అధికార పార్టీపైగానీ, సీఎం వైఎస్ జగన్ ను గానీ పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. అయితే గత కొద్ది రోజులుగా రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనబడుతోంది.
పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని బాలకృష్ణ రెండు రోజుల పర్యటన నిమిత్తం హిందూపురంకు చేరుకున్నారు. నిన్న, ఈ రోజు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. టీడీపీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ఈ సందర్భంలోనే టీడీపీ బలపర్చిన ఓ అభ్యర్థి భార్యను వైసీపీ నేతలు బెదరించడంతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాలకృష్ణ ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. వైసీపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆరాచకాలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులను బెదిరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
వైసీపీ ఆరాచాక సంస్కృతి వల్ల నష్టం కేవలం టీడీపీకే కాదు సమాజానికి ప్రమాదమని అన్నారు బాలకృష్ణ, బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు ఇంతకు ఇంత బదులు తీర్చుకుని తీరతామంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ, అయితే బాలకృష్ణ పొలిటికల్ గా యాక్టివ్ కావడం క్యాడర్ కు కొంత ఉత్సాహాన్ని నింపుతున్నా మరో పక్క పార్టీ శ్రేణుల్లో, చంద్రబాబులో టెన్షన్ కూడా నెలకొంటుందని టాక్. బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్ లు చెప్పడం వరకు ఓకే గానీ పబ్లిక్ సమావేశాల్లో వాయిస్ మీద కమాండ్ లేకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడితే అవి వివాదాస్పదం అవుతాయని భయపడుతున్నారుట. ఇటీవల కూడా బాలకృష్ణ ఓ సందర్భంలో జగన్ పాలనను విమర్శిస్తూ ఇక నేను జనంలోకి వస్తానంటూ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ రాజకీయ రంగంలో యాక్టివ్ అవ్వడం చంద్రబాబులో కలవరాన్ని కల్గిస్తుందని అంటున్నారు.