Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసుకుంటే 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్దం చేస్తూ పావులు కదుపుతున్నట్లు కనబడుతోంది. రాజకీయ పార్టీలు సానుభూతి డ్రామాలు, సింపథీ గేమ్స్ మొదలు పెట్టాయి. టీడీపీ (TDP) అధికార ప్రతినిధి పట్టాభి (Pattabhi) సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ను పరుష పదజాలంతో దూషించడం, దీనిపై ఆవేశానికి గురైన వైసీపీ (YCP) కార్యకర్తలు, అభిమానులు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి అంశంతో క్యాడర్ ను చైతన్యపరిచే పనిలో పడింది. వైసీపీ యేమో సీఎం జగన్ ను తిట్టారు, దుర్భాషలాడారంటూ ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్లింది. ఈ ఘటనలపై టీడీపీ ఒక రకమైన దీక్ష చేస్తే వైసీపీ మరో రకమైన దీక్ష లు చేసింది. ఈ విషయాలు ఇలా ఉంచితే..నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పరాజయం పాలైయ్యారు. ఓ మాజీ ముఖ్యమంత్రి మనుమడు, ముఖ్యమంత్రి కుమారుడు అయిన లోకేష్ ఎమ్మెల్సీగా పని చేసి మంత్రిగా బాధ్యతలు నిర్వహించి కూడా ఎన్నికల్లో ఓడిపోవడం ఒక రకంగా పరాభవమే. ఆయనకు సమకాలీకుడైన వైఎస్ జగన్ తొలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అదే విధంగా తెలంగాణలో కేసిఆర్ తనయుడు కేటిఆర్ కూడా తొలి ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో గెలిచారు. కానీ లోకేష్ కు ఆ అనుభవం రాలేదు. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో నారా లోకేష్ పరాజయం పాలైన మంగళగిరి నియోజకవర్గం నుండే పోటీ చేస్తారా?లేక వేరే సేఫ్ నియోజకవర్గాన్ని రాబోయే ఎన్నికల నాటికి ఎంచుకుంటారా ? ఆయన స్ట్రాటజీ ఏమిటి ? అనే అనుమానాలు టీడీపీలో ఉన్నాయి.
Nara Lokesh: మంగళగిరి గెలిచి గిఫ్ట్ గా ఇస్తా
అయితే నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు అనేది కుండబద్దలు కొట్టారు. నాలుగు రోజుల క్రితం చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష విరమణ కార్యక్రమంలో నారా లోకేష్ పోటీపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. తాను మంగళగిరి నుండే పోటీ చేస్తాను అని తేల్చి చెప్పేశారు. సార్ 2024 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి మంగళగిరిని గిఫ్ట్ గా ఇస్తాను అంటూ చంద్రబాబుకు లోకేష్ సభాముఖంగా తెలియజేశారు. దీంతో ఆయన మంగళగిరి పోటీ చేయడం ఫిక్స్ అన్నట్లు స్పష్టం అయ్యింది. మంగళగిరిలో ప్రస్తుతం పరిస్థితులు ఏమిటి, 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణాలు, ఆ తరువాత లోకేష్ ఏమైనా మారారా, అక్కడ టీడీపీ యంత్రాంగం ఏమైనా అప్ డేట్ అయ్యిందా. అక్కడ వైసీపీ ఎలా పని చేస్తుంది అనే విషయాలను పరిశీలిస్తే… మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గంకు చెందిన పద్మశాలీలు, చేనేత వర్గాల ఓట్లు ఎక్కువ. ఆ తరువాత ఎస్సీ, కాపు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. దుగ్గిరాల మండలంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించేది బీసీ సామాజిక వర్గ ఓటర్లు అనేది సుస్పష్టం. 2019 లో నారా లోకేష్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణంగా అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై అనేక విధాలుగా పోరాటాలు చేయడం, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం కాగా, వైసీపీ ఫ్యాన్ గాలి మరో కారణం. మరో కీలక అంశం ఏమిటంటే జనసేన పోటీ చేయడం వల్ల ఓట్లు చీలడం మరో కారణం. లోకేష్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. లోకేష్ ఏడువేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. అక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థికి పదివేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేన దెబ్బ లోకేష్ మీద పడింది అన్నది స్పష్టం అవుతోంది. దాంతో పాటు లోకేష్ రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి అంతర్గత వ్యవహారాలు చూసుకోవడం, గెలుస్తామన్న ధీమా (ఓవర్ కాన్ఫిడెన్స్) ఇవన్నీ కారణాలుగా ఆయన ఓటమికి పేర్కొనవచ్చు.
మంగళగిరిలో అభ్యర్ధుల గెలుపునకు బీసీ ఓటర్లే కీలకం
మరో పక్క నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం వైసీపీకి అండగా నిలిచాయి. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో ఉంటూ మాస్ లీడర్ గా పేరు తెచ్చుకోవడం ఆయనకు ప్లస్ అయ్యింది. అయితే 2019 ఎన్నికల్లో ఆర్కే గెలిచిన తరువాత పరిస్థితులు మరాయి. ఎమ్మెల్యే ఆర్కే మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్ లీడర్ లక్షణాలు ఉన్న ఆయన కొంత ఇన్ యాక్టివ్ అయ్యారని టాక్ వినబడుతోంది. గతంలో మాదిరిగా ప్రజల్లో విస్తృతంగా తిరగడం లేదు. అడపాదడపా చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప పెద్ద పెద్ద కార్యక్రమాలకు హజరు కావడం లేదు. ఇటీవల జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలో వచ్చిన ఎన్నికల ఫలితాలే వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా కనబడుతోంది. బీసీ సామాజికవ వర్గం అధికంగా ఉన్న మంగళగిరి పట్టణంలోనూ వైసీపీ పట్ల కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. అందుకే బీసీలను ఆకట్టుకునేందుకు గానూ ఇద్దరికి రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడంతో పాటు వారికి స్పష్టమైన హామీ ఇస్తూ ఎన్నికలకు ఆరు నెలల ముందే నుండే లోకేష్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తే లోకేష్ కు ఇది సేఫ్ సీటు అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రధానంగా ఇక్కడ బీసీ మంత్రం పఠించాలి. స్ట్రాటజీగా వెళ్లాలి. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులును ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లగలిగితే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఎక్కవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే గెలుస్తూ వచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ వైసీపీకి డైవర్ట్ కావడంతో 2014, 2019 ఎన్నికల్లో ఆర్కే గెలిచారు. ఈ నియోజకవర్గం టీడీపీకి టఫ్ ఫైట్ అయినప్పటికీ ఎన్నికలకు పది పదిహేను రోజుల ముందు రావడం కాకుండా ఆరు నెలల ముందు నుండే ఒక ప్రణాళికాబద్దంగా కృషి జరిపితే టీడీపీకి గెలుపు అవకాశాలు ఉంటాయి అంటున్నారు పరిశీలకులు.