Nara Lokesh Letter to CM Jagan: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపిలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి డిమాండ్ వస్తోంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. ఏపిలోనూ స్కూళ్లకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం అయిన నేపథ్యంలో నిన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఏపిలో స్కూళ్లకు సెలవులు పొడిగించే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.
Nara Lokesh Letter to CM Jagan: విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి
ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కోవిడ్ పరిస్థితులపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలోనే నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా లేఖ విడుదల చేశారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదనీ, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడకూడదని లోకేష్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు మారింత మానసిక ఆందోళనకు గురి చెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని లోకేష్ కోరారు.
విపక్షాలు విద్యా వ్యవస్థను రాజకీయం చేస్తున్నాయి
లోకేష్ లేఖపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై లోకేష్ అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేష్ పేర్కొన్నారు. విద్యార్ధుల భవిష్యత్, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి తొలి డోసు, మూడు కోట్ల మందికి రెండో డోసు వేశామని తెలిపారు. పాఠశాలల్లో టీచర్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు మంత్రి పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు చెప్పారు. ప్రతిపక్షాలు ఏ అంశమూ దొరక్క విద్యా వ్యవస్థను రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.
నాడు లోకేష్ రాశారు
గత ఏడాది కరోనా నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ కోరుతూ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసినా ఏపీలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేయలేదు. దీంతో నారా లోకేష్ లేఖ రాయడం వల్లనే ఒక వేళ పరీక్షలు రద్దు చేస్తే ఆ క్రెడిట్ లోకేష్ దక్కుతుందని పరీక్షలు రద్దు చేయలేదని అనుకున్నారు. చివరకు పరీక్షల వివాదం హైకోర్టు వరకూ వెళ్లడం, పేరెంట్స్ నుండి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇతర రాష్ట్రాల మాదిరిగా పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన చేస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాశారు. దీంతో లోకేష్ లేఖ రాశారు కాబట్టి ఒక వేళ ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉన్నా విరమించుకుంటారని అనుకుంటున్నారు. తొలి నుండి కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు వివిధ అంశాలకు సంబంధించి ఎన్ని లేఖలు రాసినా సీఎం జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.(1/2) pic.twitter.com/iCWaMJiPOt— Lokesh Nara (@naralokesh) January 17, 2022