ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒ పక్క గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు జనాల్లో తిరుగుతుండగా, ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు జిల్లాల్లో రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది నాలుగు నెలల సమయం ఉండగానే అన్ని రాజకీయ పక్షాలు జనాల్లో ఉండేందుకు కార్యచరణ సిద్దం చేసుకుంటున్నాయి. జనాలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరో సారి అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతలు జనాల్లోకి తిరుగుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అవకాశం ఇవ్వాలంటూ ఆ పార్టీ ప్రజల్లో తిరుగుతోంది.
ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర, జనసేన జనవాణి పేర్లతో పర్యటిస్తున్నారు. త్వరలో బస్సు యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా వారాహి పేరుతో వాహనాన్ని సిద్దం చేసుకున్నారు. మరో పక్క టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుండి పాదయాత్ర నిర్వహించేందుకు కార్యచరణ ప్రకటించారు. లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు పేరు, మూహూర్తం ఖరారు అయ్యింది. 2023 జనవరి 27వ తేదీ లోకేష్ చేపట్టే పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. ఈ మేరకు టీడీపీ ఓ ప్రకటన చేసింది. అంతే కాకుండా యువగళం పేరుతో ప్రత్యేక జెండాను రూపొందించారు.
యువగళం ప్రత్యేక జెండా ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు నిమ్మకాయల చిన రాజప్ప, నక్కా ఆనందబాబు, షరీఫ్, వంగలపూడి అనిత తదితర నేతలు ఆవిష్కరించారు. కుప్పం నుండి ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర విజయవంతం కోసం పార్టీ ఏర్పాట్లు చేస్తొంది. మొత్తం 400 రోజులు 4వేల కిలో మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా నడక సాగించనున్నారు. కుప్పం నుండి ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర ఇచ్చాపురం వరకూ సాగనుంది. తొలుత నారా లోకేష్ బస్సు యాత్ర చేపట్టాలని భావించినప్పటికీ ప్రజల్లో మమేకం అయ్యేందుకు పాదయాత్రే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?