5 వేలకు చేరవలో కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రీటీలు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఏపిలో ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా, తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా సోకింది. కొంచెం అస్వస్థతగా ఉండటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Nara Lokesh: హోం ఐసోలేషన్ లో
తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలే ఉండటంతో వైద్యుల సూచనల మేరకు తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు లోకేష్ తెలిపారు. తనతో కాంటాక్ట్ అయిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ, కోవిడ్ నిబంధనలు పాటించాలని నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ ట్వట్ చేసిన కొద్ది సేపటికే తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పేర్కొంటూ మరో ట్వీట్ చేయడం గమనార్హం.
అంబటి రాంబాబుకు మూడవ సారి
సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడవ సారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. సెకండ్ వేవ్ లో ఆయన రెండు సార్లు కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకున్నారు. ఇప్పుడు మరో సారి స్వల్ప లక్షణాలు కనపడటంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయిన వారు, జాగ్రత్తలు పాటిస్తున్న వారూ కరోనా బారిన పడుతుండటం వారిలో ఆందోళన కల్గిస్తోంది.