Navaneet Kaur: మహరాష్ట్రలోని అమరావతి ఎంపి, సినీనటి నవనీత్ కౌర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్నారు. ఇటీవల నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసి, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించగా బాంబే హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేసింది. కుల దృవీకరణ వివాదంలో ఆమెకు సుప్రీం కోర్టులో ఊరట లభించడంతో ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్వయంగా తెలియజేశారు. తన ఎన్నిక వ్యవహారంపై బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు నవనీత్ కౌర్ చెప్పారు. 2004 నుండి 2009 వరకూ సినీరంగంలో ఉన్నారు. 2011లో వివాహం అయిన తరువాత సినీరంగానికి దూరంగా ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరు వచ్చిందన్నారు. అందుకు కృతజ్ఞతగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు.
నవనీత్ కౌర్ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు పలు తెలుగు సినిమాల్లో నటించారు. శత్రువు, శీను వాసంతి లక్ష్మి, జగపతి, గుడ్ బాయ్, రూమ్ మెట్స్, స్టైల్, బంగారు కొండ – పక్కా, 420, యమ దొంగ, మహారథి, జాబిలమ్మ తదితర సినిమాల్లో నటించారు.