NCLT: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తరచు ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ విధానాలపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపి ప్రభుత్వ పలు నిర్ణయాలపైనా కోర్టులో పిటిషన్ లు దాఖలు చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రఘురామ కృష్ణం రాజుకు కూడా ఇబ్బందులు కలిగేలా ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చెందిన మహారాష్ట్రలోని ఇంద్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ షాక్ ఇచ్చింది. సదరు కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి ఇస్తూ ఇటీవల ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఆస్తుల క్రయ విక్రయాలపై నిషేదం విధించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
NCLT: రఘురామ కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతి
ఇండ్ భారత్ ఎనర్జీకి వరి పొట్టు సరఫరా చేసినందుకు బిల్లు రూ.56.55 లక్షలను వడ్డీతో సహా రూ.71.01 లక్షలు చెల్లించకపోవడంతో కొల్హపూర్ కు చెందిన రంగారావు, బాబూరావు గైక్వాడ్ హైదరాబాద్ లోని ఎన్సీఎల్టీ ని ఆశ్రయించారు. సదరు కంపెనీ దివాలా ప్రక్రియకు అనుమతించాలని కోరుతూ పిటిషన్ లో కోరారు. దీనిపై ఎన్సీఎల్టీ సభ్యులు బీ ఎన్ వెంకట కృష్ణ, ఏ వీరబ్రహ్మారావులతో కూడిన ధర్మాసనం రీసెంట్ గా తీర్పు వెల్లడించింది. దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా (ఐఆర్పీ) కేదారి నరసింహారావును నియమించింది. ఇంద్ భారత్ ఎనర్జీ కంపెనీ దీనిపై దాఖలు చేసిన పలు మధ్యంతర పిటిషన్లను ఎన్సీఎల్టీ కొట్టేసింది.
కాగా రఘురామకు చెందిన కంపెనీలపై బ్యాంకు రుణాలకు సంబంధించి గతంలోనే సీబీఐ కేసులు కూడా నమోదు అయి ఉన్నాయి. రఘురామ బ్యాంకు అప్పులు, ఇతర అభియోగాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇంతకు ముందు అనేక మార్లు కేంద్ర మంత్రులకు, సంబంధిత వర్గాలకు ఫిర్యాదులు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా రఘురామ వ్యవహరిస్తూ ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రఘురామపై రివేంజ్ తీర్చుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.