NEET Exam 2022: ప్రతిష్టాత్మక వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్ష తేదీల షెడ్యుల్ ను ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడిఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశం కొరకు ప్రతి ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్ష జూలై 17వ తేదీన జరగనుంది. జూలై 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నుండి సాయంత్రం 5.20 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎన్టిఏ ప్రకటించింది. నేటి నుండి మే 6వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
దేశ వ్యాప్తంగా 543 నగగరాలు, పట్టణాలతో పాటు వివిధ దేశాల్లోని 14 పట్టణాల్లో నీట్ నిర్వహించనున్నట్లు ఎన్టిఏ తెలిపింది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది నుండి నీట్ పరీక్షకు గరిష్ట వయో పరిమితి ఎత్తి వేశారు. భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాల్లో ఒక్కో సబ్జెక్టుకు 50 చొప్పున 200 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం చొప్పున 200 నిమిషాలు పరీక్ష సమయంగా ఎన్టీఏ నిర్ణయించింది. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్ధులు రాస్తున్నారు.