YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని పక్క రాష్ట్రం స్ఫూర్తిగా తీసుకుందా లేదంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగు ప్రకటన చేసిందో తెలియదు కానీ పొరుగు రాష్ట్రంలో సంచలన నిర్ణయం వెలువడింది. తమిళనాడులో ఏప్రిల్ 6 వ తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు హామీల వర్షం వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయా పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. అయితే, తాజాగా ఓ నేత సంచలన ప్రకటన చేశారు. అదే రాజధాని మార్పు.
మూడు కాదు ఐదు రాజధానులు…
తమిళనాడులో 234 స్థానాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్టీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. తాజాగా చెన్నైలో ఎన్టీకే అధినేత సీమన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐదు రాజధానులను ఏర్పాటు చేస్తామని సీమన్ ప్రకటించారు. చెన్నైతో పాటుగా కోయంబత్తూరు, కన్యాకుమారి, తిరుచ్చి, మధురైలను రాజధానులుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమిళనాడులో కొత్త రాజధానుల అంశం తెరమీదకు తీసుకురావడంతో సీమన్ ఒక్కసారిగా సంచలనంగా మారారు. ఏపీలో తెరమీదకు వచ్చిన రాజధానుల అంశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది.
స్టాలిన్ కీలక ప్రకటన
ఇక డీఎంకే నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి స్టాలిన్ అభ్యర్థుల నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తంజావూరు జిల్లా ఒరత్తనాడు నియోజకవర్గంలో స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. కరోనా బాధితులకు రూ.4వేల రూపాయల ఆర్థికసాయం అందజేస్తామని అన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, రైతు బిడ్డని అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదని, తాము అధికారంలోకి వస్తే సహకార రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు.