Nellore Court: నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో కోర్టు ఆధీనంలో ఉన్న సాక్షాలు అపహరణకు గురి కావడం తీవ్ర సంచలనం అయ్యింది. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు చొరబడి ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారు. గురువారం కోర్టు సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. అయితే ఈ అపహారణకు గురైన దస్త్రాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పై గతంలో నమోదు అయిన కేసుకు సంబంధించినవిగా భావిస్తున్నారు. ఫోర్జరీ పత్రాలతో తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా సోమిరెడ్డి గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డిపై పరువునష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి కాకాని గోవర్థన్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి కొన్ని ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
Nellore Court: దశాబ్దాల రాజకీయ వైరం
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ నేత మంత్రి కాకాణి గోవర్థన్ మధ్య చాలా కాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కాకాణి గోవర్థన్ రెడ్డి గెలిచారు. అంతకు ముందు కూడా సోమిరెడ్డి రెండు సార్లు ఓడిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకాణి గోవర్థన్ రెడ్డి వారానికి ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేసేవారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో చంద్రమోహన్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రెస్ మీట్ పెడుతూ గోవర్థన్ రెడ్డి ని విమర్శిస్తున్నారు. అయితే గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, ఆయన అక్రమంగా ఆస్తులు సంపాదించారనీ, ఆ డబ్బును హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారనీ, అక్రమంగా ఆస్తులు సంపాదించారనీ, వాటికి సంబంధించి పత్రాలు ఇవి అంటూ కొన్ని మీడియా సమావేశంలో చూపారు.
అయితే ఆ పత్రాలు అన్నీ నకిలీవి, తనకు ఎక్కడా అక్రమ ఆస్తులు లేవు అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కోర్టులో పరువునష్టం దావా కూడా వేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా కాకాణి గోవర్థన్ రెడ్డి చూపిన పత్రాలు నకిలీవే అని చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అనే వ్యక్తి తయారు చేశారని గుర్తించి అప్పట్లో (2017లో) చిరంజీవులు ను అరెస్టు చేశారు. 2017 లోనే పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. అయిదేళ్లుగా కోర్టు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఉన్నందున కోర్టులో ఆ సాక్షాలను మాయం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కోర్టులో ఆధారాలు చోరీ చేసిన కేసులో నిందితుడు దొరికినా అతనిపై చోరీ కేసు మాత్రమే నమోదు అవుతుంది. ఆధారాలు ఎక్కడో పారేశాను అని చెప్పేస్తాడు. అవి అక్కడ వెతికినా లభించవు. సో.. అసలు కేసులో ఆధారాలు మాయం కావడంతో కోర్టు ఏ విధంగా ఈ కేసు విచారణ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.