Nellore Theft Case: నెల్లురు కోర్టు చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీ సొత్తు రికవరీ చేశారు. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన కేసుకు సంబంధించి సాక్షాధారాలు మాయం కావడంతో రాజకీయ దుమారం రేగింది. ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై గతంలో ఫోర్జరీ ఆరోపణలు చేస్తూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు అప్పగించిన సాక్షాలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కోర్టుకు సమీపంలోని దాదాపు 1200 సిసి కెమెరాల పుటేజీని పరిశీలించారు. సాంకేతిక అధారాలతో నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి చోరీ చేసిన టాబ్, ల్యాప్ ట్యాప్, నాలుగు సెల్ ఫోన్ లు, ఏడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఎస్పీ విజయరావు దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆదివారం మీడియాకు వివరించారు.
Nellore Theft Case: స్క్రాప్ చోరీ చేసేందుకే వెళ్లారు
ఈ కేసులో ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. చోరీ చేసిన వాళ్లు పాత నేరస్తులని, వీరు స్క్రాప్ చోరీ చేసేందుకు కోర్టు ఆవరణకు వెళ్లారన్నారు. అయితే అక్కడ కుక్కలు అరవడంతో కోర్టు మెట్లు ఎక్కి పై అంతస్తుకు వెళ్లి తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారన్నారు. అక్కడ బీరువా తెరవగా ఒక బ్యాగ్ కనిపించడంతో దాన్ని తీసుకుని వెళ్లిపోయారనీ, దానిలో ఏమి ఉన్నాయో కూడా తెలియదన్నారు. బయటకు వచ్చిన తరువాత బ్యాగ్ లోని విలువైన వస్తువులు తీసుకుని మిగిలినవి కాలువ పక్కన పడేశారని ఎస్పీ చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా ఈ నేరానికి పాల్పడింది పాత నేరస్తులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్ లుగా గుర్తించి వారిని ఆత్మకూరు బస్జాండ్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరు నిందితులపై 14 కేసులు ఉన్నాయన్నారు.
13వ తేదీ అర్ధరాత్రి చోరీ
జరిగింది ఏమిటంటే.. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఓ కేసుకు సంబంధించి కీలక పత్రాలు చోరీ అయ్యాయి. 14వ తేదీ ఉదయం కోర్టుకు వచ్చిన సిబ్బంది చోరీ జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్న బజారు పోలీస్ స్టేషన్ లో దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా, అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోర్టు ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో సమీపం లోని ప్రాంతాల సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఎట్టకేలకు నాలుగు రోజుల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేయడం విశేేషం.