Black Fungus: ఓ వైపు కరోనా కలకలం కొనసాగుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ సైతం ఈ రోగులను ఇబ్బందిపెడుతోందన్న వార్తలు పలువురిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ వ్యాధి చికిత్స గురించి ఎన్నో సందేహాలు, చికిత్సలో భాగంగా ఎదురయ్యే వివిధ రకాలైన ఇబ్బందుల గురించి అనేకమందిలో సందేహాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించిన చికత్సపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
బ్లాక్ ఫంగస్ చికిత్స మందులు… ఆషామాషీ కాదు..
బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం పక్కాగా రూపొందించింది. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో వాడే లైపోజోమల్ యాంఫోటెరిసిన్–బి డ్రగ్ను నేరుగా పేషెంట్లకే అందించేందుకు డీఎంఈ రమేశ్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తమ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్కు ఈ డ్రగ్ అవసరమని డాక్టర్లు భావిస్తే, ఆ విషయాన్ని తెలుపుతూ కమిటీకి మెయిల్([email protected]) ద్వారా సదరు హాస్పిటల్ అప్లికేషన్ పెట్టాలి. డీఎంఈ ధ్వర్యంలోని కమిటీ ఈ అప్లికేషన్ను పరిశీలించి ఆ పేషెంట్ పేరు మీద అప్రూవల్ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ను మెయిల్కే పంపిస్తుంది. ఈ లెటర్ తీసుకుపోయి డీఎంఈ సూచించిన ఫార్మా కంపెనీ స్టోర్లో చూపిస్తే, వాళ్లు వివరాలు నమోదు చేసుకుని ఆ డ్రగ్ ఇస్తారు.
అక్రమాలకు పాల్పడితే అంతే సంగతులు..
బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే మందుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లైపోజోమల్ యాంఫోటెరిసిన్ డ్రగ్ను హెటిరో, సిప్ల, మైలాన్, సన్ ఫార్మా, జైడస్ కాడిలా, యునైటెడ్ బయోటెక్, నియాన్ ల్యాబ్స్ సహా 17 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ కంపెనీలు అన్నింటికీ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ నోటీసులిచ్చింది. ఎన్ని డోసులు డ్రగ్ తయారు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తయారు చేసిన డ్రగ్ను ప్రైవేట్ హాస్పిటళ్లకు, సప్లయర్స్కు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తయారు చేసిన వాటిని స్టాకిస్ట్ దగ్గర ఉంచుకోవాలని, డీఎంఈ నేతృత్వంలోని కమిటీ అప్రూవల్ ఇచ్చిన వ్యక్తులకే డ్రగ్ అమ్మాలని సూచించింది. తద్వారా బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టింది.