NGT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జిటీ) మరో షాక్ ఇచ్చింది. ఇటీవల పోలవరం ప్రాజెక్టుతో సహా పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవంటూ భారీ ఎత్తున ఎన్జీటీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరో షాక్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఎన్జీటీ. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్జీటీ సూచించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి, కేంద్ర జలసంఘం అధికారి సహా నలుగురితో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.
NGT: ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఏపి ప్రభుత్వం బాధ్యత వహించాలి
నిపుణుల కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్ జీ టీ. ఇదే క్రమంలో ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పై కోర్టు దిక్కారం చర్యలు అవసరం లేదని ఎన్జీటీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దానికి ఏపి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పరిణామం ఏపి సర్కార్ కు ఊహించని ఎదురుదెబ్బగా మారింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది.