Night Curfew lifted: కోవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులతో సమీక్ష జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందనీ, పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. యాక్టివ్ కేసుల రేటు 0.82 శాతానికి పడిపోయిందనీ, గత వారం 1,00,622 పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 18,920కి పడిపోయాయని తెలిపారు. ఆసుపత్రిలో 794 మంది అడ్మిట్ కాగా వారిలో కేవలం 130మంది మాత్రమే ఐసీయూలో ఉన్నారని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయని తెలిపారు.
Night Curfew lifted: మార్గదర్శకాలు కొనసాగించాలి
సమీక్ష అనంతరం సీఎం జగన్.. రాత్రి పూట కర్ఫ్యూ తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ మాస్క్ లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగించాలని ఆదేశించారు. వ్యాపార సముదాయాల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఫీవర్ సర్వే కొనసాగిస్తూ లక్షణాలు ఉన్న వారికి కోవిడ్ టెస్ట్ ల ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు.
వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయాలి
వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు త్వరగా పూర్తి చేసి సిబ్బంది తప్పనిసరిగా ఆసుపత్రుల్లో ఉండేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని సీఎం ఆదేశించారు. నిపుణులైన వారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అవ్వాలని సీఎం ఆదేశించారు. స్పెషలిస్ట్ వైద్యులకు ఇస్తున్న మూలవేతనంత 50శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించామని సీఎం జగన్ అన్నారు.