Nimagadda Ramesh: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ .. ఏపీ ఎన్నికల కమిషనర్ . ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రమేశ్ కుమార్ అన్నీ తానై కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఆయన లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడిస్తున్నాయి. కొందరు మసమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో తాజాగా నిమ్మగడ్డ సానుకూల నిర్ణయం తీసుకుంటే కూడా అటు ఫిర్యాదు చేసిన వారు … ఇటు ఆ నిర్ణయానికి ప్రభావితం అయిన వారు వ్యతిరేకించడం గమనార్హం.
Nimagadda Ramesh అసలేం జరిగింది ?
పంచాయతీ ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలసి ఫిర్యాదు లేఖను వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అందించారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
అనంతరం వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినందున చర్యలు తీసుకోవాలని తాము కోరామని అన్నారు. అయితే విచారించిన ఎస్ఈసీ తెదేపా మేనిఫెస్టోను మాత్రమే రద్దు చేశారని అన్నారు. ఎన్నికల నియమావళిని చంద్రబాబు ఉల్లంఘించారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చామని అయినా సరే మేనిఫెస్టో రద్దు చేసి కేవలం తూతూ మంత్రంగా ఎస్ఈసీ చర్యలు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్ఈసీని కోరామని అన్నారు.
టీడీపీ కి ఇంకో మంట
మరోవైపు మేనిఫెస్టో విషయంలో తెలుగుదేశం భగ్గుమంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. ఎస్ఈసీని వర్ల రామయ్య,బోండా ఉమా,అశోక్ బాబు,వెంకటరాజు కలిశారు.
అనంతరం వర్లరామయ్య మీడియాతో మాట్లాడుతూ ఏ నిబంధనల ప్రకారం మేనిఫెస్టో రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసీని అడిగామని తెలిపారు. అయితే న్యాయస్థానం కు వెళ్లాలని ఎస్ఈసీ సమాధానమిచ్చారని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఇటు నిర్ణయం తీసుకున్న విషయంలో టీడీపీ కస్సుమంటుంటే… మరోవైపు తాము ఆశించినట్లుగా స్పందించడం లేదని వైసీపీ కస్సుమంటోంది. మొత్తంగా నిమ్మగడ్డ కష్టాలు ఎవరికి రావొద్దని అంటున్నారు.