Nimmagadda : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ లు వేరువేరుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తొలుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ ను కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను గవర్నర్ కు వివరించారు. దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్ తో సమావేశమైన నిమ్మగడ్డ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సహకారం అందేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఆదేశించాలని కోరారు. ఇదే సందర్భంగా కొందరు అధికారులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యల అంశాన్ని గవర్నర్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ వివరించారు.
గవర్నర్ బిశ్వభూషణ్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసిన తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అదిత్యనాథ్ దాస్ గవర్నర్ ను కలిశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ గా వార్ జరిగిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య అంతరం తగ్గించే ప్రయత్నంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటు ఎస్ఈసీతో అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పరస్పరం సహకరించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విషయంపై చర్చ జరిగింది. అవసరమైతే ఎస్ఈసీ, సీఎస్ తో కలిసి చర్చించాలని గవర్నర్ భావిస్తున్నారు. ఎస్ఈసీతో భేటీలో పంచాయతీరాజ్ అధికారుల అభిశంసన పైనా గవర్నర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా శాంతి భద్రతలు, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ తదితర ప్రక్రియతో పాటు కరోనా వ్యాక్సినేషన్ కు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ అదిత్యనాధ్ తో గవర్నర్ చర్చించినట్లు సమాచారం.