Nimmagadda : ఏపిలో ఎస్ఈసీ, వైసీపి ప్రభుత్వం మధ్య తీవ్ర వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య నడుస్తున్న ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే దీనికి ప్రభుత్వం నో చెప్పింది. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకపోతే బాగుండదు అంటూ హెచ్చరిక మాదిరిగా మరో లేఖ సంధించారు. ఎస్ఈసీ లేఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాధ్ దాస్ ప్రత్యుత్తరాలు ఇస్తూ వస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న పలు సూచనలపై సానుకూలంగా స్పందిస్తున్న సీఎస్ అదిత్యనాధ్ దాస్..ఐఎఎస్ అధికారులపై చర్యల విషయంలో “అలా చేయడం కుదరదు, సాధ్యపడదు. ఎస్ఈసికి అ అధికారం ఉండదు, పునః సమీక్షించుకోండి” అన్నట్లుగా తిరుగు టపా ఇస్తున్నారు.
ఇటీవలే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృషారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదే లేఖలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణలపై ఆరోపణలు చేశారు. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన మంత్రులు బొత్సా, పెద్దిరెడ్డిలు మొన్న అసెంబ్లీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభాహక్కుల ఉల్లంఘటన నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
సోమవారం స్వీకర్ తమ్మినేని సీతారాంకు నేరుగా కలిసి ఉల్లంఘన నోటీసులు అందజేశారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేనిని మంత్రులు కోరారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన స్పీకర్ తమ్మినేని ఎస్ఈసీ పై చర్యలు ప్రారంభించారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి ఎస్ఈసీ నిమ్మగడ్డ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని. ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు చేశారు. దీనిపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనున్నది.
ఈ పరిణామాల క్రమంలో మహారాష్ట్ర లో 2008లో అప్పటి ఎస్ఈసీ నందలాల్ కు అసెంబ్లీ స్పీకర్ రెండు రోజులు జైలు శిక్ష వేసిన తెరపైకి వచ్చింది. నాడు సభా హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్నికల కమిషనర్ నందలాల్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్ చర్యలు తీసుకున్నారు. వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మీకో విషయం తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు. 2008లో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్న నందలాల్ సభాహక్కులకు భంగం కల్గించారని అనాటి మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తేల్చి చెప్పడంతో అసెంబ్లీ స్పీకర్ జైలు శిక్ష వేసి నేరుగా అరెస్టు చేసి జైలుకు పంపారని పేర్కొంటున్నారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పైనా ప్రివిలైజ్ కమిటీ విచారణకు ఆదేశించారని గుర్తు చేస్తున్నారు. తప్పు చేసినట్లు తేలితే నిమ్మగడ్డ జైలుకు వెళ్లడం ఖాయమని, పదవీ విరమణ అయిన తర్వాత కూడా జైలుకు పంపే చాన్సు ఉందని అంటున్నారు. ప్రివిలేజ్ కమిటీ విచారణకు నిమ్మగడ్డ సహకరిస్తారా లేదా అని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై నిమ్మగడ్డ ఇంత వరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఈ విషయంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.