Nimmagadda : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదమే నడిచింది. చివరకు సుప్రీం కోర్టులో ఎస్ఈసీ అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఒక పక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం, ఎస్ఈసీ మద్య ఉప్పు – నిప్పు లాంటి పరిస్థితే కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం సమన్వయంతో వ్యవహరించాలని కోర్టులు సూచించినా ఇక్కడ సమన్వయ పరిస్థితులు కనబడటం లేదు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.
Jagan : నిమ్మగడ్డ ఉత్తర్వులకు తూట్లు
ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడి ఏర్పాట్లు చేసినా నిమ్మగడ్డ ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విచక్షణాధికారాల పేరుతో నిమ్మగడ్డ తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే పోతే తాము చూస్తూ ఊరుకోమని అంటున్నది ప్రభుత్వం. ఈ క్రమంలోనే పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లపై అభిశంసన ఉత్తర్వులను నిమ్మగడ్డ జారీ చేస్తే ప్రభుత్వం తిప్పి పంపింది. ఇదే విషయంపై డీఓపిటికి ప్రభుత్వం లేఖ రాసింది. ఆ తరువాత ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి రవిచంద్ర ను నియమించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ లేఖను ప్రభుత్వం పట్టించుకోకుండా రవిచంద్ర కోసం వైద్యఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా కార్యదర్శి పోస్టును సృష్టించి ఆయనకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ బాధ్యతలను అప్పగించింది. ఆ తరువాత సీఎంఓల కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ రాశారు. దీనిపైనా ప్రభుత్వం స్పందించలేదు. ఎస్ఈసీ చర్యలపై ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చారు. తాను ఏతప్పు చేయలేని స్పష్టం చేశారు. చివరకు ఎస్ఈీసి నిమ్మగడ్డ తన ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా మరో లేఖ ప్రభుత్వానికి రాశారు. ఇలా నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖలు రాయడం వాటిని ప్రభుత్వం లైట్ గా తీసుకోవడం తెలిసిందే. అయితే ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎపిసోడ్ లో కోర్టుకు వెళ్లిన ప్రతి సారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ కు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ప్రభుత్వానికి మరో రెండు షాక్ లు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
Nimmagadda : నిమ్మగడ్డ పదవీ కాలం పొడిగింపు సాధ్యమేనా?
పంచాయతీ ఎన్నికలు వద్దు మొర్రో అని వైసీపీ అంటుంటే పంచాయతీ ఎన్నికలు పెట్టేస్తున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే వరుసగా మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్ పీ టీ సీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ పంచాయతీ చివరి విడత ఎన్నికలు పూర్తి అయిన వెంటనే మరుసటి రోజు 22 వ తేదీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ప్రభుత్వానికి మరో షాక్ యే. అయితే నిమ్మగడ్డ పదవీ కాలం మార్చి 31వ తేదీ వరకే ఉంది. ఈ లోపుగా మొత్తం అన్ని ఎన్నికలు పూర్తి చేయాలంటే సాధ్యపడదు. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం నిమ్మగడ్డను అర్ధాంతరంగా ఆ పదవి నుండి తొలగించి కనగరాజ్ ను నియమించిన సమయంలో రెండు నెలల పదవీ కాలం కోల్పోయారు. ఆ సమయంలో హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించి తిరిగి ఎస్ఈసీ కుర్చీలో కూర్చున్నారు నిమ్మగడ్డ. నిమ్మగడ్డ కోల్పోయిన ఆ రెండు నెలల కాలాన్ని పొడిగించాలని గవర్నర్ ను కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ గవర్నర్ నిమ్మగడ్డ పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించేందుకు అనుమతి ఇవ్వకపోతే మళ్లీ హైకోర్టు కు వెళ్లి మరీ సాధించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇది గనుక జరిగితే జగన్ సర్కార్ కు మరో షాకింగ్ న్యూస్ యే అవుతుంది. ఈ చర్యలను నిలువరించేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ ఏమి చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.