Nimmagadda Ramesh Kumar : ఏపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరు సీనియర్ అధికారులకు, ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 3.61 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. సాంకేతిక, న్యాయ చిక్కుల వల్ల 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ వివరించారు. ఈ ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారనీ, నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డులో నమోదు చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు.
ఈ ఇద్దరు అధికారులను ప్రభుత్వం బదిలీ చేయగా ఆ బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ వారిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఇటీవల ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీలతో సహా గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే.
Nimmagadda : బుధవారం ఉన్నతాధికారులతో ఎస్ఈసీ సమీక్ష
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ, జడ్పీ సీఈఓలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం (రేపు) సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హజరుకానున్నారు. సమీక్షలో పాల్గొనాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్ లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు బదిలీ అయ్యారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.