Nimmagadda Ramesh Kumar : ఏపి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈ సీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదంటూ పలువురు మంత్రులు చాలా గట్టిగా చెప్పారు. అయినప్పటికీ తాను ఎన్నికలు నిర్వహించే పదవీ విరమణ చేయాలన్న పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యూహాత్మకంగా అడుగులు వేసి సక్సెస్ సాధించారు. దీంతో రాష్ట్రంలోని గ్రామాల్లో స్థానిక పంచాయతీ ఎన్నికల కోలాహాలం ప్రారంభం అయ్యింది. మొత్తం నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఫిబ్రవరి 21 వ చివరి విడత ఎన్నికలు ముగియనున్నాయి.
అయితే ఈ ఎన్నికలు ముగియగానే మరో ఎన్నికలకు తెరలేపే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మూహూర్తం ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమని సర్వోన్నత న్యాయం తేల్చి చెప్పేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిలో పనిగా పంచాయతీ ఎన్నికలు అయిన వెంటనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పిబ్రవరి 21 వ తేదీన పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన వెంటే ఆ మరుసటి రోజు అంటే 22 వ తేదీన మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిపికేషన్ వెలువడుతుందని సమాచారం.
ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభమయ్యే పంచాయతీ ఎన్నికల పోలింగ్ 13,17,21 తేదీలతో ముగియనున్నది. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అయితే ఫిబ్రవరి 22 వ తేదీనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో నిర్వహించవచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను గత ఏడాది మార్చి నెలలో నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న కారణంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాడు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు.