Nimmagadda Ramesh Kumar: ఏపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఇరుకున పెట్టి ఎన్నికల విషయంలో తన పంతం నెగ్గించుకుని తప్పుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వైసీపీ ఇక పూర్తిగా వదిలివేసిందా..? లేక కరోనా నేపథ్యంలో కాస్త విరామం ఇచ్చిందా..? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిమ్మగడ్డ వ్యవహారం మరో సారి తెరపైకి వస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రివిలేజ్ కమిటీలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఉన్న సంగతి తెలిసిందే. ప్రివిలేజ్ కమిటీ నోటీసుకు నాడు రిప్లై అయితే ఇచ్చారు కానీ వ్యక్తిగతంగా నిమ్మగడ్డ హజరుకాలేదు. అయితే కరోనా తీవ్రత కారణంగానే ఇప్పటి వరకూ నిమ్మగడ్డ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గిన తరువాత ప్రివిలేజ్ కమిటీ తిరిగి నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తన పదవీకాలం పూర్తి అయిన తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే ఇటీవల వైసీపీ ముఖ్యనేత ఒకరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రివిలేజ్ కమిటీలో కేసు పురోగతిని స్వయంగా పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు మరో సారి నోటీసులు పంపాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే వరకూ రాష్ట్రంలో ప్రజానీకానికి పెద్దగా తెలియని అధికారి. అయితే నాడు కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం వైసీపీతో పాటు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. ఆనాడు సీఎం జగన్ ఏకంగా మీడియా ముందుకు వచ్చి నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే ఎన్నికలను వాయిదా వేశాడంటూ తీవ్ర స్థాయిలో దుర్భాషలాడటమే కాక ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆ తరువాత నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదిస్తూ జీవో జారీ చేయడంతో పాటు అఘమేఖాల మీద రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను ఎస్ఈసీగా నియమించారు. దీనిపై తొలుత నిమ్మగడ్డ హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టు వరకూ వెళ్లి తిరిగి ఎస్ఈసీగా నియమితులు కావడంతో ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ ఏపిసోడ్ నడిచింది. దీంతో రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ నిమ్మగడ్డ పేరు సుపరిచితం అయింది.
Read More: Mansas Trust: అశోక్ గజపతి రాజుపై విజయసాయి రెడ్డి ఎంతమాట అనేశాడు..!!
నిమ్మగడ్డ పై మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ, చంద్రబాబు ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ పని చేస్తున్నారని, కరోనా వేళ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఎన్నికలు జరగకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయినప్పటికీ నిమ్మగడ్డ సుప్రీం కోర్టు వరకూ వెళ్లి ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల సమయంలోనూ నిమ్మగడ్డ తీరును వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ తరుణంలోనే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణలు నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై నిమ్మగడ్డ పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు ఉంటాయనేది తేలాలంటే మరో కొద్ది రోజులు వేచి చూడాలి.