Nimmagadda Ramesh Kumar : గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో రెండు నెలలు కళ్లు మూసుకుంటే హాయిగా ఎటువంటి ఒత్తిడులు లేకుండా పదవీ విరమణ అయిపోయే వారు. కాకపోతే ఒక్క ఎన్నిక కూడా నిర్వహించకుండా పదవీ విరమణ అయిన ఎస్ఈసీగా రికార్డులోకి ఎక్కేవారు. అందుకేనేమో ఒక్క ఎన్నిక అయిన నిర్వహించి తాను చేపట్టిన పదవికి న్యాయం చేయాలని భావించి ఉంటారు. అందుకే ప్రభుత్వంపై పోరాడి మరీ ఎన్నికలకు సిద్ధమైయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత నాలుగు సంవత్సరాలలో ఒక్క ఎన్నిక జరగలేదు. చివరి సంవత్సరం ప్రారంభంలో ఎంపీటీసీ, జడ్ పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తరువాత కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని వార్తలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా వాయిదా వేశారు.
Nimmagadda Ramesh Kumar : నేటి నుండి తొలి దశ నామినేషన్లు స్వీకరణ
ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్నికలు నిర్వహణకు నిమ్మగడ్డ నడుం బిగించడంతో ప్రభుత్వం మోకాలడ్డింది. హైకోర్టు ను ఆశ్రయించి షెడ్యుల్ ను రద్దు చేయించింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయగా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం అక్కడ సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు పచ్చ జెండా ఊపడంతో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక నిమ్మగడ్డ తన పని తాను మొదలు పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం (నేటి) నుండి ప్రారంభం అవుతోంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలోని మండలాల్లో తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ నేడు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నారు. అక్కడ అధికారులతో ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలు తదితరులు అంశాలపై సమీక్ష జరపనున్నారు.
Nimmagadda Ramesh Kumar : రాయలసీమలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ సవాలే
అసలే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రాజకీయ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములాంటిదే. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక పక్క ఏకగ్రీవాలు అయిన పంచాయతీలకు ఇచ్చే నజరానాను భారీగా పెంపు చేశారు. జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుండి 20 లక్షల వరకూ ఎకగ్రీవ పంచాయతీలకు ఇవ్వనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. దీంతో పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కాంక్షించే వారు, రాజకీయం చేసే వారి మధ్య ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉంది. ఎకగ్రీవం చేసుకుంటే గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయనీ అందరం కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎంపిక చేయాలని కొందరు అంటే కొందరు పోటీ జరగాల్సిందే అని పట్టుబట్టే వారు ఉంటారు. దీంతో ఆయా వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఎస్ఈసీ నిమ్మగడ్డ కు పెద్ద సవాల్ యే.