Nimmagadda Ramesh Kumar : ఒక్క ఎన్నిక కూడా నిర్వహించకుండా ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అవుతారని అధికార పార్టీ నేతలు తొలుత భావించారు. కానీ పంచాయతీ, పురపాలక ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం తొలుత వ్యతిరేకంగా ఉండటంతో చాలా మంది ఎన్నికలు జరగవని అనుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ ముందుగా షెడ్యుల్ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదనీ, ఉద్యోగ సంఘాలు కూడా కోవిడ్ భయంతో ఉన్నారని ప్రభుత్వం వాదించింది. దీంతో హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఎస్ఈసీ..సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు బెంచ్ కు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇయ్యడం, దానిపై రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణకు వ్యాక్సినేషన్ అడ్డుకాదని, ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించడానికి ముందుకు రావడంతో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిపోయాయి. మెజార్టీ స్థానాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి అవ్వడంతో గత ఏడాది కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పురపాలక, జడ్ పీ టీ సీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం తన సమ్మతి తెలియజేసింది. ఈ క్రమంలో పురపాలక సంఘ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోయాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలు ఈ నెలలో లేనట్లేనా…?
రీపోలింగ్ లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం ఇదే ప్రధమమని ఎస్ఈసీ నిమ్మగడ్డ హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ అభినందనలు తెలియజేశారు. ఇక మిగిలిన ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు పిటిషన్ లు హైకోర్టు విచారణలో ఉండటంతో ఈ నెలలో నిర్వహించే పరిస్థితి కనబడటం లేదు. ఈ నెల 14వ తేదీన పురపాలక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన మరుసటి రోజే అంటే 15వ తేదీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 24వ తేదీన నిమ్మగడ్డ టూర్ ముగించుకొని వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత నిమ్మగడ్డ పదవీ విరమణకు వారం రోజులు మాత్రమే ఉండటంతో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా వదిలివేయవచ్చని అంటున్నారు. కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఆ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.