Nimmagadda ramesh : ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గత కొద్దికాలంగా ఎన్నికల విషయంలో దూకుడుగా ముందుకు సాగుతున్న నిమ్మగడ్డ రమేష్ మున్సిపల్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్ఈసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందరూ సహకరించడం వల్లనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగిందని తెలిపారు. పురపాలక ఎన్నికల విషయంలోనూ అదే విధంగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల అధికారులు. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యాం.. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి వివక్ష లేకుండా చేపడతామన్నారు. మున్సిపల్ ఓటర్లు చైతన్యం కలిగిన వాళ్లూ.. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనాలని నిమ్మగడ్డ రమేష్ సూచించారు.
నామినేషన్లనపై కీలక నిర్ణయం
నామినేషన్లు గందరగోళంపై త్వరలోనే వివరాలు అందుతాయన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ బలవంతపు నామినేషన్ల విషయంలో అభ్యర్ధిత్వాల పునరుద్ధరణపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటామన్నారు.. పరిమితులకు లోబడి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించిన ఆయన.. త్వరలోనే నామినేషన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నామినేషన్లు వేయలేకపోయిన వారికి.. స్క్రూట్నీలో పోయిన వారికి తిరిగి నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటింటికి ఎన్నికల ప్రచారంలో ఐదుగురుకు మించి పాల్గొనకూడదని అభ్యర్థులకు సూచించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రచారంలో రోడ్ షోలకు అనుమతిస్తాం.. డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
వాలంటీర్లకు షాకిచ్చే నిర్ణయం
వాలంటీర్లను ఎన్నికల విధుల్లో నిషేధించామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో కానీ.. ఎన్నికల్లో కానీ వలంటీర్లు జోక్యం చేసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే, ప్రభుత్వ విధుల్లో.. ప్రభుత్వం అప్పగించిన పనిని మాత్రం వలంటీర్లు చేపట్టవచ్చని తెలిపారు.