Nimmagadda : ఏపిలో ఎస్ఈసీ, వైసీపీ ప్రభుత్వం మధ్య తీవ్ర వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నిమ్మగడ్డ పై నిత్యం వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా రోజుకో ఉత్తర్వులు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా నిమ్మగడ్డ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందరు అధికారులను ఆయన (ఎస్ఈసీ) బదిలీ చేసుకుంటూ అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే ఇక ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎందుకు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ చంద్రబాబు మనిషి అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి కూడా నోటీసులు జారీ చేయడం గమనార్హం. అది ఎందుకంటే..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల క్రితం గ్రామాభివృద్ధికి పంచ సూత్రాలు పేరుతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీ ఏమి చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఏమి చర్యలు తీసుకుంటారు అని కూడా ఆయన ప్రశ్నించారు. అదే విధంగా చంద్రబాబు మేనిఫేస్టో విడుదల చేయడంపై వైసీీపీ ఎన్నికల సంఘానికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఎస్ఈసీ స్పందించింది.
టీడీపీ అధిష్టానానికి నోటీసు జారీ చేస్తూ మేనిఫేస్టో విడుదల చేయడంపై ఫిబ్రవరి 2వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలలో మేనిఫెస్టో సరైందని కాదని ఎస్ఈసీ సూచించింది. సరైన వివరణ ఇవ్వకుంటే ఎస్ఈసీ చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొంది. ఇప్పుడు టీడీపీపై ఎస్ఈసీ ఏమి చర్యలు తీసుకుంటుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు తెలియక మేనిపెస్టో విడుదల చేశానని చెప్పలేరు. ఏమని సమాధానం ఇస్తారో చూడాలి మరి.