Nimmagadda : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఇప్పటి వరకూ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్నట్లుగా సాగిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టు పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో ఓ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలో పాల్గొన్న సందర్భంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమ పార్టీ ఎన్నికలకు భయపడి వద్దనడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ యే కారణమని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పున గౌరవిస్తామని పేర్కొంటూనే రాష్ట్రంలో ఎవరికి ఆరోగ్యపరమైన గానీ కరోనా పరం గానీ ఇబ్బందులు వచ్చినా దానికి నిమ్మగడ్డ బాధ్యత వహించాలని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఎస్ఈసీ ఈ ఎన్నికలను నిర్వహిస్తోందని మండిపడ్డారు. 2018లో హైకోర్టు ఎన్నికలు నిర్వహించమని ఆదేశిస్తే ఎస్ఈసీ ఎందుకు ఎన్నికలను నిర్వహించలేదని ప్రశ్నించారు.
విశాఖ రైల్వే న్యూకాలనీ, శ్రీకన్య ధియేటర్ పక్కన ఇందిరా కాలనీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న మౌలిక వసతుల కల్పనకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలకు తాము అండగా ఉంటామని హమీ ఇచ్చారు. పరిపాలనా రాజధాని విశాఖలో సెంటు భూమి కూడా చాలా విలువైనదని చెబుతూ కోర్టు సమస్యలు పరిష్కారం అయిన వెంటనే పేద వర్గాల ఇళ్లకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని విజయసాయి రెడ్డి తెలిపారు. విజయసాయి వెంట ఎంపి ఎన్ వి సత్యనారాయణ, ఎమ్మెల్యేల వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.