Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు కీలకమైన రాజకీయ పార్టీల నేతల సన్నిహితులు.. రక్తసంబందులు అరెస్టు అవుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ పలుమార్లు విచారించడం జరిగింది. కాగా ఇప్పుడు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈనెల 18న వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని ఫిబ్రవరి 10వ తారీఖున ఈడీ అరెస్టు చేయడం జరిగింది.
ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ తరపున మిగిలిన వ్యక్తులతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే రాఘవరెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డినీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ విచారించడానికి రెడీ అవుతూ ఉంది. ఇక ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తుది దశకు చేరుకుందని ఈడి స్పష్టం చేయడం జరిగింది. సౌత్ గ్రూపులో కవిత, మాగుంటను విచారించాల్సి ఉందని ఈడీ స్పష్టం చేసింది. ఈ ఇద్దరినీ విచారిస్తే కేసు పూర్తవుతుందని పిళ్ళై కస్టడీ పిటీషన్ విచారణ సందర్భంగా పేర్కొంది.
మరోపక్క అరుణ్ పిళ్ళై కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగించగా… ఆ లోపు మిగిలిన వారందరి విచారణ పూర్తి చేయాలని స్పెషల్ కోర్ట్ ఈడికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయాన్ని ఆడిటర్ బుచ్చిబాబు ధ్రువీకరించారని ఈడీ పేర్కొనటం సంచలనంగా మారింది. అరబిందో ఫార్మా కు చెందిన శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించేందుకు కవిత ఏర్పాటు చేసినట్లు ఈడీ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.