ఎన్ఆర్ఐలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీకి ఎన్ఆర్ఐ విభాగం అనేది ఒకటి ఉంటుంది. వీళ్లు ఆ పార్టీకి తెరవెనుక వ్యూహాల విషయంలో గానీ, తెరవెనుక సహకారం, వనరుల సహకారం, ఆర్ధిక సహకారం ఇలా చాలా రకాలుగా అందిస్తుంటారు. ఎన్ఆర్ఐల విషయంలో మొదటి నుండి తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా దేశాల్లో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలు ఉన్నాయి. వైసీపీతో పోలిస్తే ఈ విషయంలో టీడీపీయే బలంగా ఉందని చెప్పవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగాలు ఏర్పాటు అవుతున్నాయి. జనసేనకు సంబంధించి ఒకటి రెండు దేశాల్లో బలంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐల విషయం ఎందుకు అంటే.. ఇప్పటి వరకూ తెరవెనుక సాంకేతిక సహకారం, ఆర్ధిక సహకారం, వ్యూహాల కోసమో, అప్పుడప్పుడు ఎన్నికల సమయంలో గెస్ట్ లుగా వచ్చి గ్రామాల్లో ఓట్లు వేసి ప్రచారానికో పరిమితమైన ఎన్ఆర్ఐలు రాబోయే ఎన్నికల్లో కీలక భూమికను పోషించనున్నారు. చాలా మంది ఎన్ఆర్ఐలు పోటీకి సైతం రెడీ అవుతున్నారు. పార్టీలకు టికెట్ ల కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా పోటీ ఉందని సమాచారం. దాదాపు పది నియోజకవర్గాల నుండి తెలుగుదేశం పార్టీని ఎన్ఆర్ఐలు టికెట్లు అడుగుతున్నారని తెలుస్తొంది. టికెట్ ఇస్తే వచ్చేస్తారు. అక్కడే నియోజకవర్గంలో ఉంటాము, పోటీకి దిగుతాము అని పార్టీకి సమాచారం ఇస్తున్నారు.
టీడీపీ నుండి పది మంది ఎన్ఆర్ఐలు
ఉదాహరణకు చూసుకుంటే .. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గానికి ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు యూఎస్ లో స్థిరపడ్డారు. ఆయన అప్పుడప్పుడు తన నియోజకవర్గానికి వస్తూ తన ఫౌండేషన్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించారు. ఈయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన ప్రతిపాదన పార్టీ దృష్టికి వెళ్లింది. ఆయన అభ్యర్ధిత్వాన్ని పార్టీ కూడా దాదాపు ఖరారు చేసింది. అక్కడ వేరే ఇబ్బందులు కూడా ఏమీ లేవు. అలానే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి. చింతలపూడికి చెందిన ఎన్ ఆర్ ఐ రోషన్ కుమార్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. చింతలపూడి టికెట్ అడుగుతున్నారు. పార్టీ టికెట్ ఇస్తే సొంత ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు టికెట్ ను ఒక ఎన్ఆర్ఐ ఆశిస్తున్నారు. అలానే శ్రీకాకుళం జిల్లాలోని ఒక నియోజకవర్గం నుండి ఎన్ఆర్ఐ టికెట్ ఆశిస్తున్నారు.
ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీకి రె’ఢీ’
ఇక విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో అయితే ఒ ఎన్ఆర్ఐ ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీ చేయడానికి రెడీ అంటున్నారుట. పార్టీ తో సంబంధం లేకుండా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సై అంటున్నారు. రెండు పార్టీలకు టికెట్ కోసం ప్రతిపాదనలు పంపారని అంటున్నారు. అదే విధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి సురేష్ అనే ఎన్ఆర్ఐ ప్రయత్నిస్తున్నారుట. ఆయన నేరుగా అయితే సంప్రదించలేదు కానీ ఆశవహుల జాబితాలో ఉన్నారని సమాచారం. పార్టీ పెద్దలకుగా ఆయన బాగానే తెలుసు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కోసం ఒక ఎన్ఆర్ఐ, ప్రకాశం జిల్లా దర్శిలో పోటీ చేసేందుకు ఒక ఎన్ఆర్ఐ రెడీగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ తరపున పది నియోజకవర్గాల నుండి ఎన్ఆర్ఐలు టికెట్లు ఆశిస్తుండగా, వైసీపీ నుండి మూడు నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఎన్ ఆర్ ఐలు రెడీగా ఉన్నట్లు తెలుస్తొంది. జనసేన నుండి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ పార్ట్ టైమ్ పాలిటిక్స్ కే పరిమితమైన ఎన్ఆర్ఐలు ఇప్పుడు నేరుగా పోటీకి సిద్దమై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం విశేషం. ఎన్ఆర్ఐలు పోటీ పడుతున్న మొదటి ఎన్నికలుగా 2024 ఎన్నికలను పేర్కొనవచ్చు.
చంద్రబాబు సీరియస్ నిర్ణయం .. ఆ 75 మంది ఇన్ చార్జిల్లో ఎవరెవరు ఔట్ ..?