NTR In Politics: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామయ్య దంపతులకు జన్మించారు. నేడు ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా.. రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు…
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ..అంటే 1983 జనవరిలో తొలి సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్నారు. మొత్తం 294 స్థానాలు ఉన్న ఏపి అసెంబ్లీలో 199 స్థానాలు కైవశం చేసుకుని తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అధికారం చేపట్టిన ఎన్టీఆర్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైనది ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపు నిర్ణయం. ఇలాంటి పలు వివాదాస్పద నిర్ణయాల కారణంగా ప్రజాభిమానం తగ్గుతూ వచ్చింది.
ఇదే క్రమంలో 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు అప్పటి గవర్నర్ రాంలాల్, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీల లోపాయికారి సహకారంతో ఎన్టీఆర్ ను అధికారం నుండి దింపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎన్టీఆర్ తిరిగి ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎలుగెత్తి చాటారు. నాటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ఆ ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే తిరిగి సీఎం పీఠంలో ఎన్టీఆర్ కూర్చున్నారు. ఆ తరువాత సినిమా రంగంలో స్లాబ్ విధానం అమలు చేయడం, శాసనమండలి రద్దు, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కట్టపై (ట్యాంక్ బండ్) తెలుగుజాతి రత్నాల విగ్రహాల ఏర్పాటు వంటి సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. అధికారం చేపట్టిన రెండేళ్లలోనే నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సాధించాలన్న లక్ష్యంతో 1985లో అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో 202 స్థానాల్లో టీడీపీ విజయదుంధుబి మోగించి తిరిగి అధికారంలోకి వచ్చారు.
1985 నుండి 89 వరకూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తాను చెప్పిందే వేదం, తాను చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తూ పరిపాలన సాగించడంతో ప్రజల్లో, పార్టీలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. 1989 ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రి వర్గాన్ని ఏకపక్షంగా రద్దు చేసి కొత్త మంత్రులను తీసుకుని సంచలనం సృష్టించారు. ఆ కాలంలో జరిగిన కొన్ని కుల ఘర్షణలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశాయి. దీంతో 1989 ఎన్నికల్లో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.
Read More: Video Viral: ఏసీబీ అధికారినంటూ పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి..!!
అయితే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినా దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకువచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భూమికను పోషించారు. 1989 నుండి 94వరకూ ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ ఉన్నారు. 1993లో తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. 1994లో ఎన్నికల్లో కిలో రెండు రూపాయల బియ్యం, సంపూర్ణ మధ్య నిషేదం వంటి హామీలతో ప్రజల్లోకి వెళ్లడంతో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వంలో, పార్టీలో లక్ష్మీపార్వతి విపరీత జోక్యంతో పార్టీ ముఖ్యనేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు 1995 ఆగస్టు నెలలో ఆయనకు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వైశ్రాయ్ హోటల్ క్యాంప్ రాజకీయం నిర్వహించారు. 160 మంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పరిణామంతో ఎన్టీఆర్ రాజకీయ శకం ముగిసిపోయింది. తరువాత 1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో మృతి చెందారు.