Megastar Chiru: మెగాస్టార్ చిరంజీవి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా కార్యక్రమాలు తప్ప రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని పలు సందర్భాల్లో కలవడం, పరిపాలనలో జగన్మోహనరెడ్డి చేపడతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. ఆ మేరకు ట్విట్టర్ వేదికగా జగన్ కు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు.
ఓ పక్క ఏపిలో చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే చిరు మాత్రం మధ్య మధ్య జగన్ కు అనుకూలంగా ట్వట్ లు చేస్తుండటంతో వారి అభిమానులు విస్మయానికి గురి అవుతున్నారు. చిరు ట్వీట్ లకు అభిమానులు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్క చిరు వైసీపీ అనుకూలమంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసిన తరువాత చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో, క్రియాశీల రాజకీయాలలో పెద్దగా కనబడలేదు.
Read More: YS Sharmila: ఏపి, తెలంగాణ నీటి పంచాయతీపై వైఎస్ షర్మిల స్పందన ఇదీ..!!
చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయంపై కాంగ్రెస్ పార్టీ ఏపి వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ క్లారిటీ ఇచ్చారు. ఏపిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్న ఆయన చిరంజీవి గురించి స్పష్టత ఇచ్చారు. పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించిందన్నారు. జూలై 7వ తేదీ నుండి 17వ తేదీ వరకూ పది రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడుతోందని చెప్పారు ఉమెన్ చాందీ. ఈ సందర్భంగా మీడియా చిరంజీవి ఈ కార్యక్రమాల్లో పాల్లొంటారా అని ప్రశ్నకు కీలక విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి పార్టీలో కొనసాగడం లేదని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర పార్టీ నాయకులకు, శ్రేణులకు చిరు విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.