Open school Exams: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఓపెన్ స్కూల్ సొసైటి ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2021 జులై నెలలో బోర్డు పరీక్షలను రాసేందుకు ఫీజు చెల్లించిన, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు రెగ్యులర్ విద్యార్ధుల తరహాలోనే ఓపెన్ స్కూల్ విద్యార్థులనూ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులో పేర్కొంది.
ఏపి ఓపెన్ స్కూల్ సొసైటి పోర్టల్ లో అందుబాటులో ఉన్న వివరాల మేరకు టెన్త్ విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు ఎస్ఎస్సీ మార్కులపై 30 శాతం వెయిటేజీ, సన్నద్దం కోసం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కులపై 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజేశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.