Panchayat polls : ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపునకు అనేక రకాలుగా పాట్లు పడుతుంటారు. గ్రామంలో ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తామంటూ హామీల హామీలు ఇస్తుంటారు. ప్రచార పర్వం పూర్తి అయిన తరువాత ఓటర్ల కు మందు, మనీతో పాటు ప్రత్యేక తాయిలాలు .అందజేయడం చూశాం. కానీ ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఉచిత హామీలను ఇవ్వడం ఒక ఎత్తు అయితే వాటిని బాండు పేపరు పై ప్రమాణ పత్రంగా రాసి ఇవ్వడం మరోక ఎత్తు. నిజంగా ఆ హామీలను అమలు చేయాలంటే ఆయనకు ఉన్న ఆస్తులను అమ్మాల్సిందే. అయితే ఆ నాయకుడు ఇచ్చిన హామీ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఆదివారం జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు ఈ హామీ పత్రాన్ని ఆ నేత విడుదల చేస్తూ గ్రామంలోని 14 వార్డులలో పెద్దలకు అందజేశారు.
Panchayat polls : హామీల్లో నయా ట్రెండ్
రాజకీయ పార్టీల నేతల ఎన్నికల హామీలను ఎన్నికల తరువాత మరచిపోతారని, పట్టించుకోరన్న అభిప్రాయం చాలా మందిలో ఉండనే ఉంది. అందుకే నేమో ప్రజల్లో నమ్మకం కల్గించేందుకు ఇటీవల బాండు పేపరుపై తమ హామీలను రాసి ఇవ్వడం కొత్త ట్రెండ్ అయిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ నియోజకవర్గ ప్రజలకు తాను గెలిస్తే ఏమి చేయనున్నారో పేర్కొంటూ ఇచ్చిన హామీలను బాండు పేపరుపై రాసి ఇచ్చిన విషయం చాలా మందికి గుర్తు ఉండి ఉంటుంది. బాండు పేపరు పై హామీలను రాసి ఇచ్చినా ఆ ఎన్నికల్లో జెడి లక్ష్మీనారాయణ పరాజయం పాలైయ్యారు. కాకపోయే రెండు లక్షల పైచిలుకు ఓట్లు రావడం ఆయనకు కొంత ఊరటను ఇచ్చింది. అదే మాదిరిగా నేడు తూర్పు గోదావరి జిల్లాలో ఓ నాయకుడు తమ అభ్యర్థుల గెలుపునకు హామీగా పంచరత్నాలు ప్రకటించారు. ఆ పంచరత్నాలను ఏడాది పాటు అమలు చేస్తానంటూ 20 రూపాయల బాండ్ పేపరుపై ప్రమాణ పత్రంగా రాసి ఇవ్వడం ఆసక్తికరం.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మేడిశెట్టి సురేఖ, 5వ వార్డు అభ్యర్థిగా కోనాల పేర్రెడ్డి బరిలో ఉన్నారు. వీరికి మద్దతు ఇస్తున్న వైసీపీ నాయకుడు పడాల రంగారెడ్డి.. వీరిని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రంగారెడ్డి ప్రకటించిన పంచ రత్న హామీలు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి అమలు చేయాలంటే సొంత ఆస్తులను అమ్ముకోవాల్సిందేనంటున్నారు.
ఇంతకూ ఆయన ఇచ్చిన హామీలు ఏమిటంటే…1. సంవత్సరం పాటు కేబుల్ ప్రసారాలు ఉచితంగా అందించడం, 2. గ్రామంలో ఏడాది పాటు రేషన్ సరుకులు ఉచితంగా అందించడం, 3. ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఉచితంగా మంచినీళ్లు అందించడం, 4. గ్రామస్తులకు ఏడాది పాటు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించడం, 5.. ప్రతిభ కనబర్చిన పది మంది విద్యార్థులకు ఒక్కొరొక్కరికి రూ.10వేలు చొప్పున అందించడం. అంతే కాకుండా 2022 – 23 సంవత్సరానికి గాను ఇంటి పన్ను, నీటి కళాయి పన్నులను రద్దు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఏడాది పాటు అందిస్తానని రంగారెడ్డి హమీ ఇచ్చారు. ఈ హామీలను గ్రామ ప్రజలు నమ్ముతారో లేదో బాండ్ పేపరు హామీ పత్రంపై ఓటర్ల తీర్పు ఎలా ఏ విధంగా ఉంటుందో ఆదివారం సాయంత్రానికి తెలిసిపోనుంది.