Panchayat polls : రాష్ట్ర వ్యాప్తంగా చివరి దశ గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. గుంటూరు జిల్లాలోని పలు కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ జరిగిన మూడు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా నేడు మాత్రం దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్తెనపల్లి మండలం దూళిపాళలో ఇద్దరు ఏజంట్ లు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు.
వీరు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా హోంశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలంలో ముట్టూరు లో పోలింగ్ బూత్ పైే ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘర్షణలో ఇద్దరు ఇద్దరు ఏజంట్ లు స్పృహ తప్పి పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కంటెపూడి గ్రామంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య హోరాహోరీ నెలకొన్న నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన చీఫ్ ఎలక్షన్ ఏజంట్ కృష్ణారెడ్డి కనిపించకుండా పోయారు. పోలీసుల నుండి వేధింపుల వల్ల కృష్ణారెడ్డి కనిపించకుండా పోయారంటూ అతని వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలనూ ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు వర్గాలు బలంగా ఉన్న చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడ గ్రామంలో భారీ గా దొంగ ఓట్లు పోల్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఓటర్ల కంటే ముందుగానే వచ్చిన నకిలీ ఓటర్లు ఓటు వేసి వెళ్లిపోయారు అసలు ఓటర్లు వచ్చి పోలింగ్ సిబ్బందితో గొడవకు దిగి తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని పట్టుబట్టడంతో టెండర్ ఓటుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే టెండరు ఓట్లు రెండు శాతం కంటే మించితే పోలింగ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణలు జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నారు.ప్రకాశం, చిత్తూరు జిల్లాలోనూ ఘర్షణుల జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘర్షణ కారణంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో కందులవారిపల్లి, సాయినగర్ పంచాయతీ పరిధిలో పోలింగ్ బూత్ ల వద్ద రెండు వర్గాల మధ్యణలు తలెత్తడంతో పోలీసులు అదుపు చేశారు.