Panchayat Polls : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ (4వ దశ) పోలింగ్ ఆదివారం (21వ తేదీ) జరగనున్నది. 13 జిల్లాలోని 16 రెవెన్యూ డివిజన్ లలో 161 మండలాల్లో 2745 గ్రామ పంచాయతీలు ఉండగా రెండు గ్రామాల్లో నామినేషన్ లు దాఖలు కాలేదు. దీంతో 2743 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2743 సర్పంచ్ పదవులకు గానూ 7475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22,514 వార్డు మెంబర్ స్థానాలకు గానూ 91 స్థానాల్లో నామినేషన్ లు దాఖలు కాలేదు. 22,423 వార్డు మెంబర్ లకు గాను 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాల్గవ దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 28,995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. వీటిలో 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట ఏర్పటు చేశామని, సెంటర్ లలో వీడియో రికార్డు చేస్తున్నామని ద్వివేది తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన మూడు దశల ఎన్నికల పోలింగ్ లో చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తి అయ్యాయి. చివరి విడత ఎన్నికలను సమర్థవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ చివరి దశ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల మద్దతుగా బరిలో నిల్చిన అభ్యర్థుల విజయానికి నేతలు విశేష కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నేతలు ప్రలోభాలకు తెరలేపారు. గ్రామాల్లో ఆధిపత్యం నిలుపుకునేందుకు కొందరు, అధిపత్యం సాధించేందుకు మరి కొందరు పోటాపోటీగా పలు ప్రాంతాల్లో మద్యం, నగదుతో పాటు ప్రత్యేక తాయిలాలు కూడా అందజేసేందుకు సిద్ధమయ్యారు. పోలీస్, ఎన్నికల అధికారుల నిఘా కొనసాగుతున్నా గుట్టుచప్పుడు కాకుండా ప్రలోభాల పర్వం కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి.