panchayat polls : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ ఉప నేత కింజారపు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజారపు సురేష్ భారీ ఓట్ల అధిక్యతతో విజయం సాధించారు. కింజారపు సురేష్ కు 1827 ఓట్లు రాగా, వైసీపీ బలపర్చిన అభ్యర్థి కింజారపు అప్పన్నకు కేవలం 157 ఓట్లు వచ్చాయి.
ఈ గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా కింజారపు కుటుంబం నుంచే ఏకగ్రీవం అవుతూ వచ్చింది. తొలి సారిగా వైసీపీ కింజరపు కుటుంబానికే చెందిన అప్పన్నను బలపర్చి సర్పంచ్ అభ్యర్థిగా నిలిపింది. నామినేషన్ల ప్ర్రక్రియ సందర్భంలో వైసీపీ బలపర్చిన అభ్యర్థిని అప్పన్నను అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలు బెదిరించారని, హత్యాయత్నంకు పాల్పడ్డారని ఫిర్యాదు మేరకు అచ్చెన్నాయుడుతో సహా 22 మందిపై కేసు నమోదు చేశారు. ఇటీవల అచ్చెన్నాయుడుతో సహా ఆ పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా అచ్చెన్నాయుడు నేడు బెయిల్ పై విడుదల అయి గ్రామానికి చేరుకున్నారు. అచ్చెన్నాయుడు సోదరుడు కుమారుడు సురేష్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో కింజారపు కుటుంబ ఆధిపత్యం కొనసాగుతున్నట్లు మరో సారి రుజువు అయ్యింది.