Panchayat Polls : గతంలో పలు గ్రామ పంచాయతీలు కొన్ని కుటుంబాల ఆధీనంలో ఉండేవి. వారు చెప్పిందే వేదం, శాసనంగా కొనసాగేది. రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు కూర్చుని సర్పంచ్, పాలవర్గాన్ని ఏకగ్రీవం చేసుకునే వారు. గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా పంచాయతీ పెద్ద చేదోడు వాదోడుగా ఉండేవాళ్లు. దీంతో దశాబ్దాల తరబడి ఆ ఫ్యామిలీ ఆధిపత్యం గ్రామాల్లో కొనసాగుతూ ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కుటుంబ పాలనకు చెరమగీతం పాడుతున్నారు. గతంలో రాజకీయాలను కుటుంబాలను శాసించేవి, కానీ ఇప్పుడు కుటుంబాలను రాజకీయ పార్టీలు శాసిస్తున్నాయి. దీంతో దగ్గరి బంధు వర్గం కూడా ప్రత్యర్థులు అవుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లు అయితే దశాబ్దాల కాలంగా కింజారపు, కిమిడి, తమ్మినేని కుటుంబాలు రాజకీయంగా పాతుకుపోయిన కుటుంబాలు. వారి నియోజకవర్గాలతో పాటు వారి స్వగ్రామాల్లో ఆ కుటుంబాలదే ఆధిపత్యం కొనసాగుతుండేది. ప్రస్తుత పంచాయితీ సమరంలో ఆ కుటుంబాలకు చెందిన ప్రత్యర్థులుగా మారి తలపడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది. ఈ పరిణామం కొందరు గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా అమదాలవలస మండలంలోని తొగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వదిన భారతమ్మ రంగంలో నిలవగా వైసీపీ మద్దతుతో సీతారాం సతీమణి వాణిశ్రీ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ సీతారాం చక్రం తిప్పి ప్రత్యర్థిగా నిలిచిన వదిన భారతమ్మ కుమారుడిని తమ వైపుకు తిప్పుకున్నారు. భారతమ్మ కుమారుడు తల్లికి మద్దతుగా ప్రచారం చేయకుండా పిన్నికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడా పోరు రసవత్తరంగా జరుగుతోంది.
ఇదే జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు కుటుంబ సభ్యులు కూడా పంచాయతీ రేస్ లో నిలిచారు. వీరి స్వగ్రామం రేగడి పంచాయతీతో టీడీపీ మద్దతుతో ఒక కోడలు, వైసీపీ మద్దతుతో మరో కోడలు సర్పంచ్ పదవి రేస్ లో తలపడటం ఆసక్తికరంగా మారింది. కిమిడి కళా వెంకట్రావు అన్నదమ్ములు 8 మంది కాగా వారిలో వెంకట్రావు ఏడవ వాడు. వీరు అంతా ఐక్యంగా కలిసి మెలసి ఉండేవారు. అయితే వీరి తరువాత తరంలో ఆ ఐక్యత లోపించింది. రేగడి పంచాయతీ ఈ సారి బిసి మహిళకు రిజర్వ్ కాగా కళా వెంకట్రావు అయిదవ అన్న సత్యనారాయణ నాయుడు కోడలు రేవతి టీడీపీ మద్దతుతో సర్పంచ్ బరిలోకి దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ముమ్మరంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. రేవతికి ప్రత్యర్థిగా కళా వెంకట్రావు ఆరవ అన్న నీలం నాయుడు కోడలు పద్మావతి వైసీపీ మద్దతుతో బరిలో ఉన్నారు. ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కిమిడి కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి.
ఇంతకు ముందు పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ గ్రామంలోనూ కింజారపు ఫ్యామిలీ ఫైట్ అందరికీ తెలిసిందే. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు అన్న కుమారుడు సుధాకర్ టీడీపీ మద్దతుతో పోటీ చేయగా వారి కుటుంబానికే చెందిన అప్పన్నను వైసీపీ తరుపున పోటీగా నిలిపారు. ఇక్కడి పంచాయతీ పోరులో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవం అవుతున్న ఈ పంచాయతీలో మొదటి సారి పోటీ జరిగినా అచ్చెన్నాయుడు బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇలా రాజకీయ పార్టీల్లో సీనియర్ నేతల కుటుంబ సభ్యులు పంచాయతీ పోరులో తలపడటం ఆసక్తికరంగా మారుతోంది.