Panchayat polls : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడవ దశలో 3221 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 579 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 2,639 సర్పంచ్, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుండగా, ఉదయం 6.30 గంటల నుండే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకూ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకూ పోలింగ్ కొనసాగనున్నది.
13 జిల్లాలలో 160 మండలాలలో 26,851 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడవ దశ పోలింగ్ లో 55,75,004 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్ వేయలేదు. కర్నూలు జిల్లా లోని పాత ముచ్చమర్రి, కొత్త ముచ్చమర్రి గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గ్రామ ప్రజలు ఓటు వేశారు. ఇన్ని సంవత్సరాలు తర్వాత ఓటు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.